హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): దేశానికి బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని దుయ్యబట్టారు. గాంధీభవన్లో మంగళవారం సాయంత్రం రేవంత్రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్తో కలిసిరేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది మన దేశంలోనేనని, ఇదే మోదీ సాధించిన ఘనత అని దుయ్యబట్టారు.
మణిపూర్లో జరిగిన ఘటనలు దేశాన్ని కుదిపేసినా ప్రధాని అక్కడికి వెళ్లలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడం ఒక్కటే బీజేపీకి తెలుసునని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ముప్పుగా పరిణమించిన బీజేపీని గద్దె దింపడం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికే సాధ్యమని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్కు, బీజేపీకి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా, రాహుల్గాంధీ ప్రధాని కావాలన్నా రాష్ట్రంలో 17కు 17 లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే కేంద్రం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఇరుపార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదని అన్నారు. దీనిని ప్రజలు ఎక్కడ గుర్తిస్తారోనన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై ఎదురుదాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ను మాత్రమే టార్గెట్ చేయడంలో.. బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అర్థం అవుతున్నాయని ఆరోపించారు. ఈ దేశంలో ఓడించాల్సిన మోదీని వదిలేసి వారు కాంగ్రెస్ను టార్గెట్ చేయడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. పార్టీల ఫిరాయింపులు, అప్పులలో కేసీఆర్, మోదీ ఒక్కటేనని విమర్శించారు.
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేస్తుందని చెప్పారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో పోటి చేయాలనుకొనే ఆశావాహుల నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఆ దరఖాస్తులను వడబోసి అభ్యర్థులను ఎంపిక చేసేది కూడా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీనే అని చెప్పారు.
మరో 60 రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న నిర్వహించే భారీ బహిరంగసభతో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాగాంధీని కోరామని చెప్పారు. ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకొని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవాలని అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన కోదండరాం ప్రమాణ స్వీకారం చేయకుండా రాజకీయ కుట్రతో అడ్డుకున్నారని ఆరోపించారు.