హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు అని, మిగ తా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా చేసేందుకు ఎంతోమంది కృషి చేశారని, ఆ ప్రతిష్ఠను కొనసాగించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని చెప్పారు. శుక్రవారం ఫలక్నుమాలో మెట్రో రెండో దశలో ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గం నిర్మాణ పనులకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలోనే ఎంఐఎంతో వైరం. ఆ తర్వాత అభివృద్ధి గురించి పరస్పరం కలిసి చర్చించుకుంటూ ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాం. అందులో భాగంగానే ఎంఐఎం ప్రజాప్రతినిధిని లండన్లోని థేమ్స్ నదీ తీరం అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు తీసుకెళ్లాం’ అని వివరించారు. మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పాతబస్తీకి రావాల్సిన మెట్రో ఆలస్యమైందని, అందుకే 5.5 కిలోమీటర్ల మెట్రోమార్గంలో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఒవైసీ దవాఖాన, చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, పీ7 రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోమార్గాన్ని నిర్మించాలని నిర్ణయించామని వెల్లడించారు. మరిన్ని మార్గాల్లో మెట్రో నిర్మాణానికి డీపీఆర్లను రూపొందిస్తున్నామని తెలిపారు. చాంద్రాయణగుట్టలో అతి పెద్ద మెట్రో జంక్షన్ నిర్మాణం జరుగుతుందని అన్నారు.
చంచల్గూడ జైలు స్థానంలో విద్యాసంస్థ
అసదుద్దీన్ ఒవైసీ సూచన మేరకు చంచల్గూడ జైలును తరలించి, ఆ స్థానంలో పేద, మధ్య తరగతి ప్రజల పిల్లలకు అవసరమైన విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తామని రేవంత్ తెలిపారు. ఉస్మానియా దవాఖానను సైతం అత్యాధునికంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీరాలం చెరువుపై ఒక బ్రిడ్జిని నిర్మించాలని కోరారని, దానికి రూ.360 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్లో ప్రతి వీధి అభివృద్ధి జరగాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ఉన్నదని, అందుకే పురపాలకశాఖను తన వద్దే పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తుంటానని పేర్కొన్నారు.
సోదరుడికి సీఎం పరామర్శ
అనారోగ్యంతో హైటెక్సిటీలోని మెడికవర్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన సోదరుడు తిరుపతిరెడ్డిని సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం.. ఎయిర్పోర్టు నుంచి నేరుగా మెడికవర్ దవాఖానకు వెళ్లి సోదరుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, త్వరలోనే కోలుకుని ఇంటికి చేరుకుంటారని వైద్యులు తెలిపారు.
అభివృద్ధిలో ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ;అసదుద్దీన్ ఒవైసీ
అభివృద్ధిలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని అసుదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ‘తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలన్నదే మా ఉద్దేశం. దానికి అనుగుణంగా పనిచేసే వారికి పూర్తి సహకారం అందిస్తాం. రేవంత్రెడ్డి సీఎం కాగానే పాతనగరంలో పలు రోడ్ల విస్తరణ పనులకు నిధులు కావాలని కోరా. రూ.120 కోట్లు అడిగితే, రెండు రోజుల తర్వాత స్వయంగా ఆయనే ఫోన్ చేసి రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మూసీ నదిని అభివృద్ధి చేయాలి. అది పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని వెల్లడించారు.