హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానలు పేదలకు దేవాలయాల్లాంటివి. ఏదైనా వ్యాధితో సర్కారు దవాఖానకు వచ్చిన పేదలకు పైసా ఖర్చు కాకుండా ఆరోగ్యంగా తిరిగి వెళ్లాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఆ లక్ష్య సాధన కోసం ఇప్పటికే వైద్యారోగ్య రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజావైద్యాన్ని పటిష్ఠం చేశారు. పీహెచ్సీ మొదలు అన్ని స్థాయిల దవాఖానల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచారు. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతోపాటు టీ-డయాగ్నస్టిక్స్ను అందుబాటులోకి తెచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షల ఖర్చు లేకుండా చేశారు.
ఫలితంగా ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ఇదే స్ఫూర్తితో ఈ సంస్కరణల వేగాన్ని మరింత వేగవంతం చేశారు. గత ఏడాది కాలంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేసి చరిత్రలో నిలిచిపోయారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, ఏమేం కావాలో నిర్ణయాలు తీసుకొంటున్నారు. తదనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టగా.. ఇందులో ఆరు సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని ఓసారి పరిశీలిస్తే.. పెరిగిన ఔషధాల జాబితా
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మందుల జాబితాను సంసరించాలని సీఎం కేసీఆర్ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులు బయటి నుంచి ఎలాంటి మందులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా చూడాలన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేసి ఉచితంగా అందించే మందుల్లో కొత్తగా 123 రకాల ఔషధాలను చేర్చింది. దీంతో ఉచిత ఔషధాల సంఖ్య 720 నుంచి 843కి పెరిగింది. వీటిలో 311 అత్యవసర ఔషధాల జాబితా (ఈఎంఎల్)లో, 532 అదనపు ఔషధాల జాబితా (ఏఎంఎల్)లో ఉన్నాయి.
గతంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేక రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రైవేట్ను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పీహెచ్సీ మొదలు అన్ని స్థాయిల దవాఖానల్లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేస్తున్నది. డీఎంఈ, టీవీవీపీ, డీపీహెచ్ పరిధిలోని వెయ్యికిపైగా దవాఖానల కోసం రూ.350 కోట్లు ఖర్చు చేసి 30 వేలకుపైగా వైద్య పరికరాలు కొనుగోలు చేసింది. సిటీసాన్లు, ఎంఆర్ఐ, వెంటిలేటర్లు, క్యాథ్ల్యాబ్ వంటి అనేక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వాటి నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘బయో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ’ని రూపొందించి, మానిటరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ పాలసీ అమలుకు రూ.35 కోట్లు కేటాయించింది.
దవాఖానలకు వచ్చే రోగులకు ప్రభుత్వం ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నది. అయితే వారికి సహాయంగా వచ్చేవారు మాత్రం బయట హోటళ్లలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తున్నది. అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఒక పూట ఆదుకొన్నప్పటికీ మిగతా రెండు పూటలకు కనీసం రూ.100 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీన్ని భరించలేక చాలామంది పస్తులు ఉంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రోగి సహాయకులకు రూ.5కే భోజనం అందించాలని, మూడు పూటలా కడుపునిండా తిండి పెట్టాలని నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్ సహకారంతో జీహెచ్ంఎసీ పరిధిలో మొత్తం 18 దవాఖానల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా రోజూ దాదాపు 20 వేల మందికి ప్రయోజనం కలుగుతున్నది. దీని కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.40 కోట్ల వరకు వెచ్చించనున్నది. ఒక్కో ప్లేట్ భోజనం తయారీకి రూ.24.25 ఖర్చవుతున్నట్టు అంచనా. ఇందులో ప్రభుత్వం రూ.19.25 రాయితీగా అందిస్తున్నది. రోగి సహాయకుల నుంచి రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు.
దవాఖానల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయడంపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 20 ప్రధాన దవాఖానల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) ఏర్పాటుకు ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇందుకు ప్రభుత్వం రూ.134.46 కోట్లు ఖర్చు చేస్తున్నది. వీటిని హైబ్రిడ్ యాన్యువిటీ మోడల్ (హెచ్ఏఎం)లో నిర్మిస్తున్నారు. నిర్మాణ సంస్థలే పదేండ్లపాటు ప్లాంట్లను నిర్వహించనున్నాయి. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, టిమ్స్, నీలోఫర్ దవాఖానలతోపాటు మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సూర్యపేట, నల్లగొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజీ, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ దవాఖానల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
సర్కారీ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య చికిత్సతోపాటు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం డైట్ చార్జీలను రెట్టింపు చేసింది. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు ఇచ్చే చార్జీలను రూ.56 నుంచి 112కు.. సాధారణ రోగుల డైట్ చార్జీలను రూ.40 నుంచి రూ.80 కి పెంచింది. ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.43.5 కోట్ల భారం పడనున్నది. రోగులు త్వరగా కోలుకొనేందుకు సర్కారీ దవాఖానల్లో పరిశుభ్రతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దవాఖానల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం నిర్ణయించారు. ఒక్కో బెడ్కు పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చును 50% (రూ.5 వేల నుంచి రూ.7,500కు) పెంచారు. ఇందు కోసం ప్రభుత్వం ఏటా రూ.338 కోట్లు వెచ్చించనున్నది.
జనాభా సంఖ్యకు అనుగుణంగా దళితులకు కాంట్రాక్టుల్లో కోటా ఇవ్వాలని అంబేద్కర్ బ్రిటిష్ కాలంలో డిమాండ్ చేశారు. ఆ కలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. దళితుల అభ్యున్నతికి అన్ని రంగాల్లోనూ ప్రత్యేక కోటా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పారిశుద్ధ్యం, రక్షణ (ఐహెచ్ఎఫ్ఎంఎస్), పోషకాహార (డైట్) ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయించారు. రాష్ట్రంలో 100లోపు పడకలు ఉన్న దవాఖానలు 122, వంద నుంచి 500 పడకలు ఉన్న దవాఖాన లు 53 ఉన్నాయి. వీటిలో 28 దవాఖానల ఐహెచ్ఎఫ్ఎంఎస్, 28 దవాఖానల డైట్ ఏజెన్సీలను దళితులకు కేటాయించారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండరు నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చారు. టర్నోవర్లో 50 శాతం తగ్గించారు. ఒక టెండర్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
గతంలో ఇప్పుడు పెంపు
ప్రత్యేక రోగులకు రూ.56 రూ.112 100%
సాధారణ రోగులకు రూ.40 రూ.80 100%
శానిటేషన్ చార్జీల పెంపు రూ.5 వేలు రూ.7,500 50%