ఖైరతాబాద్, జూన్ 6: హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిమ్స్ చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతం కానున్నది. నిమ్స్ విస్తరణలో భాగంగా నూతన సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణ పనులకు ఈ నెల 14న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,571 కోట్ల అంచనా వ్యయంతో మరో రెండు వేల పడకల దవాఖానను నిర్మించనున్నారు. కొత్త భవనాన్ని నిర్మించనున్న స్థలాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు ఐదు వేల మందితో సభ నిర్వహించేవిధంగా ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు.
వచ్చిన వారికి భోజన, మంచినీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని పోలీసు అధికారులను కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, ఆర్అండ్ బీ ఈఈ శశిధర్, డిప్యూటీ ఈఈ మోహన్బాబు, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, నోడల్ అధికారి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్, నిమ్స్ అనుసంధానాధికారి డాక్టర్ మార్త రమేశ్, ఆర్డీవో వసంతకుమారి, వెస్ట్జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, పంజాగుట్ట ఏసీపీ మోహన్కుమార్, సీఐ హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు ఎకరం స్థలం
నిమ్స్ విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలను ప్రస్తుతం ఓ కమ్యూనిటీ హాల్కు తరలించనున్నారు. విద్యార్థుల చదవులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిమ్స్కు సంబంధించిన స్థలంలోనే ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల కోసం ఎర్రమంజిల్లోని మోర్ సూపర్మార్కెట్ ఎదురుగా ఎకరం స్థలం కేటాయించారు.