హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలో రైతులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? దేశ వ్యవసాయ విధానం ఎలా ఉండాలి? తదితర అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయరంగ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. సోమవారం కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ) మాజీ చైర్మన్, వ్యవసాయ ఆర్థిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అశోక్ గులాటీతోపాటు పలువురు వ్యవసాయ నిపుణులతో చర్చలు జరిపారు. దేశంలో రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దేశంలో వ్యవసాయరంగాన్ని పీడిస్తున్న అంశాలేమిటి? అన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. దేశంలో పెరుగుతున్న నీరు, భూమి, వాతావరణ కాలుష్యాల ప్రభావం వ్యవసాయంపై ఏ విధంగా ఉంటుందన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా దేశంలో అమలులో ఉన్న వ్యవసాయ విధానం ఏమిటి? ఎలాంటి సంస్కరణలు అమలులో ఉన్నాయి.
కొత్తగా ఏ విధమైన వ్యవసాయ విధానం తీసుకురావాలి? దేశంలోని రైతులు ఏమి చేస్తే బాగుపడతారన్న విషయాలపై అభిప్రాయాలు పంచుకొన్నారు. నీటి కరువు అధికంగా ఉన్న ఇజ్రాయిల్లో వ్యవసాయం పురోభివృద్ధి చెందడానికి కారణాలు? చైనాలో వ్యవసాయ విధానంపైనా చర్చించారు. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి పోయి తలెత్తుకొని తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. ఇందుకు ఏమి చేయాలన్న అంశంపై ఎక్కువగా చర్చించినట్టు తెలిసింది. ఇజ్రాయిల్, చైనాలో వ్యవసాయంపై అశోక్ గులాటీ రాసిన పుస్తకంలోని అంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్కుమార్, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉన్నారు.
హైదరాబాద్కు చేరుకొన్న సీఎం
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రైతు కేం ద్రంగా జరిగిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన దేశ రాజకీయాల్లో సరికొత్త ఉద్యమ ఎజెండాను సిద్ధం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవటం జాతీయ రాజకీయ ప్రధాన స్రవంతిని ఆకర్షించింది. దీనిపై జాతీయస్థాయిలో విస్తృతంగా చర్చ సాగుతున్నది. కేసీఆర్ సెట్ చేసిన ఎజెండా అసామాన్యమైందని, అన్ని రాజకీయపార్టీలు ఈ ఎజెండాను తప్పించుకోలేకుండా చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయాల కోసం రాజకీయాలు చేసే దుస్థితి కాకుండా దేశగుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో వేసిన అడుగుగా పలువురు రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి మోదీ సర్కార్ను బోనులో నిలబెట్టడంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చర్చ సాగుతున్నది.
ముఖ్యమంత్రి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన ఆయన తన నాలుగు రోజుల పర్యటనలో యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్తో భేటీ అయ్యారు. దేశ ప్రస్తుత పరిస్థితులు, కేంద్ర, రాష్ర్ట సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తి, బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సుదీర్ఘంగా చర్చించారు. జాతి నిర్మాణంలో ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రం సాగిస్తున్న కక్షపూరిత ధోరణి వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఆలోచింపజేసిన తీరుపై జాతీయస్థాయిలో చర్చ సాగుతున్నది.
ఇద్దరు సీఎంలతో కలిసి చండీగఢ్లో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఢిల్లీ సీఎంతో కలిసి ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్వోదయ విద్యాలయాన్ని, మొహల్లా క్లినిక్ను సందర్శించారు. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్రాయ్, వ్యవసాయ ఆర్థిక రంగ నిపుణులు అశోక్ గులాటీతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయరంగం, ఆహార ధాన్యాల కొరత, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక స్థితిగతులు వంటి అంశాలపై లోతైన చర్చ జరిగింది.
26న దేవెగౌడతో భేటీ..
సీఎం కేసీఆర్ ఈ నెల 26న బెంగళూరుకు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ము ఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశం కానున్నారు. బెంగుళూరు నుంచి 27న మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ది గ్రామంలో ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకొని హైదరాబాద్ తిరిగి వస్తారు. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటకు వెళ్లే అవకాశమున్నది. అక్కడ గల్వాన్లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించి.. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయనున్నారు.