న్యూఢిల్లీ, జూలై 22 : దిగుమతి చేసుకుంటున్న జెనరిక్ ఔషధాలపై 200 శాతం పన్ను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. జెనరిక్ ఔషధాలపై దశలవారీగా 2028 ఆగస్టు నుంచి టారిఫ్ విధించనున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ఉత్పత్తిని అమెరికాలో చేపట్టాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ సామాజిక మాధ్యమంలో తన నిర్ణయం వెలువరించారు. వచ్చే ఆగస్టు నుంచి రెండేండ్ల పాటు జెనరిక్ ఔషధాల దిగుమతిపై ‘0’ శాతం టారిఫ్ ఉంటుందని, ఆ తరువాత ఏడాది పాటు టారిఫ్ను 100 శాతానికి పెంచుతామని తెలిపారు.
ఆ తరువాతి ఏడాది టారిఫ్ను 200 శాతానికి పెంచుతామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం భారత్కు చెందిన ఫార్మా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు. గత ఏడాది భారతీయ కంపెనీలు 970 కోట్ల డాలర్ల విలువైన జెనరిక్ ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేశాయి. అమెరికాలో హైపర్టెన్షన్, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక రుగ్మతలు తదితర వ్యాధుల చికిత్సకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఔషధాలను వినియోగిస్తారు.