సూర్యాపేట, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట. గోదావరి జలాలను తెచ్చి కరువు నేలను సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో బుధవారం కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో నాగారం మండలం ఈటూరు నుంచి పెన్పహాడ్ మండలం రావిచెరువు వరకు 126 గ్రామ పంచాయతీల పరిధిలో వేడుకలు నిర్వహించారు. 68 కిలోమీటర్ల మేర కాల్వ గట్లపై టెంట్లు వేసి, భోజనాలతోపాటు మంచినీటి సదుపాయం కల్పించారు. డప్పుల దరువుల మధ్య బతుకమ్మలు, కోలాటాలతో మహిళలు తరలివచ్చారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివ్వెంల మండలం సూర్యానాయక్ తండా వద్ద వేలాదిగా వచ్చిన రైతు కుటుంబాలతో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి గోదావరి జలాలకు పూజలు చేసి చీరె, పసుపు, కుంకుమ సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన లక్ష జన హారతి కార్యక్రమం వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. లక్ష మంది తో కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి జగదీశ్రెడ్డి ప్రకటించగానే కలెక్టర్ వెంకట్రావ్ వం డర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు దరఖాస్తు చేశారు. ఈ మేరకు వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ ప్రతినిధులు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు. లక్ష జన హారతి జరిగిన నాగారం మండలం ఈటూరు నుంచి పెన్పహాడ్ మండలం రావిచెరువు వరకు 126 గ్రామ పంచాయతీల పరిధిలోని 68 కిలోమీటర్ల దూరంలో కాల్వల వెంట 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి లెక్కలు తీసుకున్నారు. జలహారతిలో 1,16,142 మంది పా ల్గొన్నట్టు వండర్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల బృందం పేర్కొంది. అనంతరం వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మంత్రి జగదీశ్రెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.