హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజామోదపాలన సాగుతున్నదని పేర్కొన్నారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ సంజయ్ బండిలో పెట్రోల్ అయిపోవటంతోనే పాదయాత్ర మొదలుపెట్టారని ఎద్దేవాచేశారు. బీజేపీ నేత లు ఆరోపిస్తున్నట్టు రాష్ట్రంలో నియంత పాలన నడిస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర బీజేపీ సభ పెట్టుకొనేవారా? అని ప్రశ్నించారు. ‘బండి సంజయ్.. కేంద్రం నుంచి తెలంగాణకు దక్కాల్సిన నిధులు తేవటం కోసం ఢిల్లీకి పాదయాత్ర చెయ్’ అని సూచించారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్ సొంత రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి మా ట్లాడితే అర్థం ఉంటుందని అన్నారు. ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటో బండికి పాదయాత్ర ద్వారా తెలుస్తుందన్నా రు. అబద్ధాలు చెప్పటంలో మోదీ బడేమి యా అయితే మంత్రి కిషన్రెడ్డి చోటేమియా అని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుడ్డర్ఖాన్కు తక్కువ.. తుపాకీ రాముడికి ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ అంటేనే బద్మాష్ జూఠా పార్టీ:
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ బీజేపీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నదో చెప్పాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ డిమాండ్చేశారు. బీజేపీ అంతర్గతపోరులో తాను కేంద్రమంత్రి అన్న విషయం మరచిపోయి కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ అంటేనే బద్మాష్ జూఠా పార్టీ అని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజల్లో మత చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: ఎమ్మెల్యే రవీంద్రకుమార్
రిజర్వేషన్లపై ఇష్టారీతిగా మాట్లాడే బీజేపీ నేతలకు వాటికి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రమే అనే విషయం తెలియదా ? అని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నిలదీశారు. రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు తేల్చలేదని, బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.