Palamuru | నాగర్కర్నూల్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: ‘ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా. పార్టీలు పోటీలుపడి గంజి కేంద్రాలు పెట్టేవి. పాలుగారిన పాలమూరులో ఈ దురవస్థ ఎప్పుడు పోద్దిరా దేవుడా అని ఏడ్చేవాళ్లం. పాలమూరు జిల్లాలో ఇయ్యాల గంజికేంద్రాలు మాయమైపోయి ఊరూరా పంట కొనుగోలు కేంద్రాలు వచ్చాయి’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు వచ్చేవా? కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులు ముంగటపడేవా ? అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు కష్టాలు అర్ధం చేసుకోవటానికే తాను ఎంపీగా పోటీచేశానని ఆయన చెప్పారు. పాలమూరు నుంచి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవటం గర్వకారణమన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీతోపాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాకపోతే జిల్లా అయ్యేదా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం. దాని ఫలితం గా నాగర్కర్నూల్ జిల్లా ఏర్పడటం.. నాగర్కర్నూల్ జిల్లాలో చక్కటి కలెక్టరేట్, పోలీస్ హెడ్క్వార్టర్స్ నిర్మింపజేసుకొని ప్రారంభించుకున్నందుకు జిల్లా ప్రజలకు అభినందనలు. తెలంగాణే రాకపోయి ఉంటే నాగర్కర్నూల్ జిల్లా అయ్యే ది కాదు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, మెడికల్ కాలే జీ ఇవన్నీ సాకారమయ్యేవి కావు. కొత్త ఎస్పీ ఆఫీసు దగ్గర లైట్లేస్తే చాలామంది వచ్చి సెల్ఫీలు దిగుతున్నరని హైదరాబాద్ దాకా సమాచారం వస్తున్నది. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ టం వల్ల, నాగర్కర్నూల్ జిల్లాగా ఏర్పడటం వ ల్ల అద్భుతంగా భవనాలు రూపుదిద్దుకున్నాయి.
పాలమూరు నుంచి పోటీ అందుకే..
రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి పాలమూ రు జిల్లా చాలా వెనుకబడి ఉండేది. మంచినీళ్లకు, సాగునీళ్లకు ప్రజలు అరిగోస పడ్డరు. ఆ సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఈ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేద్దామనుకున్న. ప్రొఫెసర్ జయశంకర్ గారిని అడిగితే ‘అక్కడ పోటీచేస్తేనే ప్రజల కష్టనష్టాలు తెలుస్తాయి. మీరు పోటీ చేయండి.. ప్రజలు తప్పక గెలిపించుకుంటరు’ అని చెప్పిండు. అన్నట్టుగానే ఇక్కడి నుంచి ఎం పీగా పోటీచేసిన. ఆ రోజు పాలమూరు జిల్లాలో ఉద్యమం ఉధృతంగా లేకుండె. కానీ, ప్రజలు ప్రేమతో నన్ను ఎంపీగా గెలిపించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది. పాలమూరు ఎంపీగా ఉంటూనే తెలంగాణను సాధించుకున్నాం. అది జిల్లా కీర్తికిరీటంలో శాశ్వతంగా నిలిచి ఉంటది.
దేశంలోనే అగ్రభాగాన తెలంగాణ
సాధించుకున్న తెలంగాణతో 9 ఏండ్లు గడిచి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినం. తెలంగాణ వచ్చినంక ఒకటింబావు సంవత్సరం కరోనా, ఒక ఏడాది నోట్లరద్దుతో సతమతమైనం. మిగిలిన ఆరు, ఆరున్నరేండ్ల అతి తక్కువ సమయంలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలబెట్టినం. తలసరి ఆదాయంలో ఇండియాలో పెద్దరాష్ర్టాల్లో తెలంగాణ నంబర్వన్. కరెంట్ వస్తదో, రాదో.. అనే దుర్దశ నుంచి తలసరి విద్యుత్తు వినియోగంలో కూడా తెలంగాణ ఇయ్యాల దేశంలోనే నంబర్వన్.
సంక్షేమ రంగానికి ఏటా 50 వేల కోట్ల ఖర్చు
సంక్షేమ రంగంలో తెలంగాణ కనివీనీ ఎరుగని అభివృద్ధిని అభివృద్ధిని సాధించింది. ఎవరూ ఊహించని విధంగా సంవత్సరానికి రూ.50వేల కోట్ల ఖర్చుపెడుతూ సంక్షేమంలో రాష్ట్రం దేశంలో నంబర్వన్గా ఉన్నది. ఆసరా పింఛన్లు.. ఇతర పింఛన్లు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఊర్లల్లో, పట్టణాల్లో మీ సొంత అనుభవంలో మీరు చూస్తూనే ఉన్నారు. అణగారిన దళితజాతి సముద్ధరణకు సదుద్దేశంతో భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకునే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్రమే.
ఐదు మెడికల్ కాలేజీలు ఊహించినమా?
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినయ్. ఎప్పుడైనా జీవితం లో అనుకున్నమా? దశలవారీగా చేద్దామని మొదట శ్రీనివాస్గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్కు, ఆ తర్వాత వనపర్తికి మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నం. వెంటనే తుపాకీ గుండులాగా వచ్చిండు మీ మర్రి జనార్దన్రెడ్డి. నాగర్కర్నూల్కు కూడా మెడికల్ కాలే జీ ఇయ్యాలని నామీద అలిగి కూసున్నడు. ఏం దయ్యా నీ గొడవ? అంటే.. నాగర్కర్నూల్కు మెడికల్ కాలేజీ ఇస్తనే పోత. లేకుంటే మీ ఇం ట్లనే ఉంటా అని పంచాయితీ పెట్టిండు. అప్పటికప్పుడు ఆరోగ్యశాఖ మంత్రితో, హెల్త్ సెక్రటరీతో మాట్లాడి.. మంజూరు చేసిన.
వెనుకబడిన పాలమూరు జిల్లాకు బ్రహ్మాండంగా ఐదు మెడికల్ కాలేజీలు వస్తాయని ఎప్పుడైనా కలగన్నమా? ఇప్పుడు వాడొకడు, వీడొకడు వచ్చి.. సభలు పెట్టి అడ్డం పొడువు మాట్లాడుతున్నరు. మీ అందరూ చూస్తున్నరు. ఏ ఒక్కడూ ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు తేలేదు? దేశాన్ని పరిపాలించినోళ్లు, దత్తత తీసుకున్నోళ్లు.. మనల్ని మత్తుగొల్పిండ్రే తప్ప కనీసం మంచినీళ్లు ఇయ్యలే. అవసరం ఉన్నంత కరెంటు ఇయ్య లే. ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలే. ఒకప్పుడు పాలమూరు అనంగనే.. కల్వకుర్తి తం డాలల్లకు బిల్ క్లింటన్నో, ఇంకెవరో విదేశీయులను తీసుకొచ్చి చూపించుడు. ప్రపంచబ్యాంకోళ్లను తీసుకొచ్చి చూపించుడు. ఇదే అప్పటి భయంకరమైన పరిస్థితి. వాళ్లు ఇయ్యాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నరు.
ధ్వంసమైన చెరువుల్ని బాగు చేసుకున్నం
కాకతీయ రాజులు 75 వేల చెరువులు, కుం టలు తవ్విస్తే.. సమైక్య పాలకులు వాటిని ధ్వం సం చేసిండ్రు. రాష్ట్రం వచ్చినంక తెలంగాణను పునర్నిర్మించుకునే క్రమంలో తెచ్చిన తొలి ప్రణాళిక మిషన్ కాకతీయ. ఒకనాడు మురికితుమ్మలతో, లొట్టపీసు చెట్లతో నిండిపోయి తాంబా లం లెక్క తయారైన నాగర్కర్నూల్ పాలెంచెరువు, బిజినేపల్లి వడ్డెమానుచెరువు లాంటివి మిషన్ కాకతీయ కింద ఎలా బాగుపడ్డయో చూస్తున్నం. రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులు ఎవరి జిల్లాల్లో వాళ్లు యుద్ధం లెక్క బ్రహ్మాండంగా వాటిని బాగుచేసుకున్నరు. కాంగ్రెస్ పాలనలో కంపదారి చెట్లతో నిండిపోయిన కేసరిసముద్రం.. మైదానంలాగా మారిపోయి పిల్లలు క్రికెట్ ఆడుకునేటోళ్లు. అలాంటి చెరువు ఈ రోజు బీఆర్ఎస్ పాలనలో సుందరంగా ఎలా తయారైందో చూస్తున్నం. అక్కడ గౌతమబుద్ధుడి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నం. ఇదీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం.
‘వాగు ఎండిపాయెరా.. పెద్దవాగు ఎండిపాయెరా.. పేగు ఎండిపాయెరా..’ అని దుఃఖపడి దుందుభి వాగుమీద పాట రాసిన గోరేటి వెం కన్న.. ‘వాగు నిండిపాయెరా’
అని ఇప్పుడు సంబురపడుతున్నడు. దుందుభి వాగు మీద 10, 12 చెక్డ్యాములు కడితే.. ఈ రోజు వర్షాకాలం రాకముందే వాటినిండా నీళ్లు నిండా ఉన్నయ్. వస్తున్నప్పుడు హెలికాప్టర్ నుంచి చూస్తే నాకు కండ్లల్ల ఆనందబాష్పాలొచ్చినయ్. తోచినంతలో ప్రజల బతుకులు మారాలని తం డ్లాడినం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ ప్రాజెక్టులు పెండింగ్లో ఉండె. తెలంగాణ రాకపోతే ఈనాటికీ అవి ముందలపడకపోతుండె. ప్రభు త్వం, స్థానిక నాయకుల చొరవతో అవి అన్నీ స్విచ్ఆన్ అయ్యి.. 20లక్షల ఎకరాలకు ఈ రోజు సాగునీరు అందించే దిశగా పోతున్నం. అచ్చంపేట ప్రాంతంలో 2వేల కోట్లతో ఉమామహేశ్వర ఎత్తిపోతలను ప్రారంభించుకుంటున్నాం. చెక్డ్యాములు కట్టుకొని, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసుకుని, వాటిని ప్రాజెక్టుల నీళ్లతో నింపుకొని బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టే.. బోరుబావులు కూడా ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తున్నయ్. లక్షలాది ఎకరాల్లో పంటలు పండుతున్నయ్. ఈ జిల్లాకు చెందిన నా తమ్ముడు, కళాకారుడు సాయిచంద్తో మాట్లాడిన సందర్భంలో నేనే స్వయంగా పాట రాసిన. ‘వలసలతో వలవలా విలపించు కరువు జిల్లా.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి, పన్నీటి జలకమాడి.. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది’ అని ఆనందంతో రాసుకున్న. గద్వాల కృష్ణమోహన్రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు.. హెలికాప్టర్లో పోకుండా, ఎమ్మెల్యేలందరితో కలిసి పొలాలు చూసుకుంటూ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు బస్సులో వచ్చిన. దారిపొడవునా ఆ వరికోత మిషన్లు.. కల్లాలు.. ఎక్కడ చూసినా వడ్లరాసులు చూసి నా గుండెలు పొంగిపోయినయ్. ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు.
ఇతర రాష్ర్టాల నుంచి పాలమూరుకు వలస
వలసపోయినోళ్లందరూ వాపస్ వచ్చేసిం డ్రు. దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నరు. పాలమూరు జిల్లాకు ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పాలమూరులో నాట్లే సి పోతున్నరు. ఇది నిజంగా మనకు గర్వకారణం. భూముల ధరలు ఎట్లాపెరిగినయ్? ఒకప్పుడు ఎకరం 10,15వేలకు అమ్ముకున్న పాలమూరులో ఇయ్యాల రోడ్డు పక్కనుంటే రూ.50 లక్షలు, పెద్ద రోడ్డు పక్కనుంటే కోటి రూపాయలు. నేషనల్ హైవే పక్కన అయితే రెండు, మూడు కోట్లు ధర పలుకుతున్నయ్. కొత్త కలెక్టరేట్ దగ్గర ఎకరం నాలుగుకోట్లకు తక్కువ లేదని ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి చెప్తున్నడు. అట్లా భూముల ధరలు పెరిగినయి. పాలమూరు ప్రజలు గ్రామాల్లో ఈ రోజు లక్షల రూపాయలు ఖర్చు చేసి బొడ్రాయి పండుగ చేసుకుంటున్నరంటే మా గుండెలనిండా సంతోషం. ఇలాంటి పాలమూరునే మేం కోరుకున్నం. ఆనాడు ఉద్యమకాలంలో పాలమూరు దుస్థితిని చూసి నాలుగైదుచోట్ల నేను కండ్లల్ల నీళ్లుతీసుకున్న. నడిగడ్డకు పోయినప్పుడు నాతోపాటు ప్రజలందరూ ఏడ్చిండ్రు. కన్నీళ్లు విడిచిన పాలమూరులో అభివృద్ధి ఇంత అద్భుతంగా జరగడం సంతోషం కలిగిస్తున్నది’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
గంజికేంద్రాల చోట పంట కొనుగోలు కేంద్రాలు
ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా. రాజకీయ పార్టీలు పోటీపడి గంజి కేంద్రాలు పెట్టేవి. అవి పేపర్ల చదివితే మా కండ్లల్ల రక్తం వచ్చేది. పాలుగారిన పాలమూరులో ఈ గంజికేంద్రాలేంది! ఈ దురవస్థ ఎప్పుడు పోద్దిరా దేవుడా..! అని ఏడ్చేవాళ్లం. పాలమూరు జిల్లాలో ఈ రోజు పరిస్థితేంది? గంజికేంద్రాలు మాయమై.. ఊరూరా పంట కొనుగోలు కేంద్రాలు వచ్చేసినయి. తెలంగాణ వచ్చినంక ఏం చేసిండ్రు? ఏం సాధిచిండ్రు? అంటే ఇది మనం సాధించింది. కేసీఆర్ రాకముందు.. కేసీఆర్ కన్నా దొడ్డుగా, ఎత్తుగా చాలామంది ఉండిరి. ఏ ఒక్కరూ కనీసం మంచినీళ్లు కూడా ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ 50, 60 ఏండ్లు దేశాన్ని పాలించింది. టీడీపీ, బీజేపీ కంబైన్డ్గా చాలా సంవత్సరాలు పరిపాలించింది. కనీసం మంచినీళ్లయినా ఎందుకు ఇయ్యలేకపోయిండ్రు? ఆడబిడ్డలు ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని తిప్పలు పడేవాళ్లు. కానీ మిషన్ భగీరథతో ఈ రోజున ఇంటింటా కృష్ణమ్మ నీళ్లు దుంకుతుంటే ప్రజలు ఆనందంగా ఉన్నరు.