కొత్త రాజ్యాంగం రావాలని నేను ప్రగాఢంగా నమ్ముతా
నయా సోచ్.. నయా దిశ.. నయా సంవిధాన్.. అవసరం
75 ఏండ్ల రాజ్యాంగం ఇప్పటి అవసరాలు తీర్చలేదు
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబులు
హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): 75 ఏండ్ల రాజ్యాంగం ఈనాటి దేశ అవసరాలను తీర్చలేదని.. నూతన రాజ్యాంగ నిర్మాణం అవసరమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రగతిభవన్లో బడ్జెట్పై ప్రతిస్పందన అనంతరం.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం వివరంగా జవాబులిచ్చారు..
దేశం కోసం మీరు వేసే అడుగులో ఇతర పార్టీలను కలుపుకొని పోతారా?
‘నేను చెప్పేది ఎప్పుడైనా చరిత్రనే అయ్యింది. అది చెప్పడానికి ఆత్మవిశ్వాసం, ధైర్యం కావాలి. ఒకప్పుడు నేను చెప్పిన.. ఇలా చెప్పడానికి సాహసం కావాలె.. ఒకప్పుడు నేను ఆ సాహసం చేసిన. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతున్నా. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడుతా అని చెప్పిన.. మళ్ల తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టిన.. ఇప్పుడూ చెప్తున్నా.. ఈ దేశంలో అద్భుతమైన పరివర్తన రావడానికి, దేశ రాజకీయాల్లో, ప్రజల ఆలోచన విధానాల్లో, ఆర్థిక పురోగతిలో మార్పు రావడానికి, దేశాన్ని అద్భుతమైన ప్రపంచ ఎకానమీగా తీర్చిదిద్దడానికి అవసరమైన గుణాత్మక మార్పు కోసం నా ప్రాణాలొడ్డయినా పోరాటం చేస్తా. ఇతర పార్టీలతో కలుస్తా.. ప్రతి ఒక్కరితో కలుస్తా.. కలిసి వచ్చే వారందరినీ కలుపుకొనే పోతాం.. విడిచిపెట్టి పోతమా.. ఎవరైతే లీడ్ చేస్తరో వాళ్లే లీడర్.. రేపు మీరే ఆ లీడర్ కావచ్చు. ప్రస్తుతం ఉన్న సెటప్లో ఏమీ మారదు. కానీ దేశానికి కొత్త రాజ్యాంగం డ్రాప్ట్ చేయాల్సిన అవసరమున్నది. చాలాదేశాలు తప్పనిసరి అనుకొన్నప్పుడు రాజ్యాంగాలను తిరిగి రాసుకొన్నాయి. కొత్త రాజ్యాంగాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు మన దేశంలోనూ కొత్త రాజ్యాంగం తీసుకురావాల్సిన అవసరమున్నది. ఏక్ నయా సోచ్.. నయా దిశ.. నయా సంవిధాన్.. అదే మా ఆలోచన.
రాజ్యాంగం మారాలంటున్నారు.. సవరణలు చేయాలా.. మొత్తం మార్చాలంటారా..?
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్న. దేశం రాజ్యాంగాన్ని పునఃరచించుకోవాల్సి ఉన్నది. దేశ ప్రజల ముందు నేను ప్రతిపాదన పెడుతున్న. అందులో ఏమైనా తప్పుందా? దానిపై లోతుగా చర్చించాలి. ఎందుకంటే ఇప్పటికీ 75 ఏండ్లు గడిచిపోయాయి. ప్రజల ఆకాంక్షలు ఎందుకు నెరవేరడంలేదు? అందుకే ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలె. అందులో తప్పేమీ లేదు. ఇప్పటికే రాజ్యాంగం 88 సార్లు సవరించుకున్నం. ఎందుకు చేసుకున్నం? అయినా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రాజ్యాంగాన్ని మార్చుకొంటూనే ఉన్నాయి. ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరించుకోవడంకన్నా కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవడమే ఉత్తమం. దీనిపై మేం కూడా మేధావులతో చర్చిస్తాం. కేసీఆర్ చెప్పేది నిజమా? కాదా? అనేదానిపై దేశం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించాలి. నా 50 ఏండ్ల ప్రజా జీవితానుభవాల ఆధారంగా చెప్తున్న. ప్రస్తుత రాజ్యాంగం రాష్ర్టాలకు కొన్ని హక్కులను కల్పించింది. అదేవిధంగా కేంద్రానికి కూడా ఇచ్చింది. కానీ కేంద్రం రాష్ర్టాల హక్కులన్నింటినీ హరిస్తున్నది. వాస్తవంగా ఏం జరగాలి.. కేంద్రం రాష్ర్టాలకు మరిన్ని అధికారాలను కల్పించాలి. కేంద్ర పరిపక్వత కలిగిన నిర్ణయాలు తీసుకోవాలి.
కాంగ్రెస్ కూడా గతంలో ఇదే విధానాలను అవలంభించింది. వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్ అర్థం ఏమిటి? ఇది రాష్ర్టాల హక్కులను హరించే కుట్ర. అధికార వికేంద్రీకరణకు బదులు రోజురోజుకూ అధికార కేంద్రీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఐఏఎస్ అధికారుల నియామకాల్లోనూ ఆ పద్ధతిని పాటిస్తున్నది. ఇది అప్రజాస్వామికం. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఎందుకు లేదు? ఇదే నా ప్రశ్న. అందుకే దేశానికి కొత్త రాజ్యాంగం కావాలె. ఈ దేశంలో ఒక పరివర్తన, గుణాత్మకమైన మార్పు, ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరముంది. ఆ మార్పు కోసం కేసీఆర్గా, ఈ దేశ బిడ్డగా, ప్రజా జీవితంలో ఒక ఉన్నతస్థాయికి చేరుకొన్న వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏ రూపంలో ఉంటది? అన్నదానిపై దేశంలో చాలామందితో మాట్లాడుతున్నాం.. కొద్ది రోజుల్లోనే ఆ పాలసీని బయట పెడతాం. ఈరోజు బడ్జెట్ పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, గిరిజన వ్యతిరేక బడ్జెట్గా అభివర్ణిస్తున్నాను.
అసదుద్దీన్ ఒవైసీ యూపీలో పోటీచేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు?
తెలంగాణ బిడ్డ అసదుద్దీన్ గుర్తింపు తెచ్చుకుంటే తప్పేముంది? ముస్లిం లీగ్ నేత సులేమాన్ తరువాత ఇండియన్ ముస్లిం కమ్యూనిటీ ఫేస్గా తనను ప్రొజెక్ట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో చాలా వరకు సఫలమవుతున్నారు. ఆయనకు అదే ఎజెండా, ఇంకోటి ఏం లేదు. ఆయన మా సోదరుడే.. పలు రాష్ర్టాల్లో పార్టీని కాపాడుకుంటున్న ఓ సిపాయి. బీహార్లో ఐదారు సీట్లు, మహారాష్ట్రలో నాలుగు సీట్లు గెలిచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
కేంద్రం బడ్జెట్లో ‘గిఫ్ట్’ సిటీకి ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టాలనుకోవడాన్ని ఎలా చూస్తున్నారు?
శిఖండిని పెడుతున్నరు. కేంద్రం ఓర్వలేనితనానికి బడ్జెట్లో చేసిన ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రతిపాదనే నిదర్శనం. అదే తెలంగాణలో ఏర్పాటు చేసిన ఐఏఎంసీకి రూ.100 కోట్లు ఇచ్చి, గుజరాత్లో మరో కేంద్రం పెడుతున్నామని చెప్తే బాగుండేది. అలా చేయలేదు.
యూపీ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలను ఎలా చూస్తున్నారు?
దేశంలో రాజకీయ పరిపక్వత లేనివాళ్లు ఈ ఐదు రాష్ర్టాల ఎన్నికలను రాబోయే 2024 జనరల్ ఎన్నికలను సెమీఫైనల్గా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎన్నికలు జరుగుతున్న అతిపెద్ద రాష్ట్రం యూపీలో గెలిచేది ఎవరైనా కావొచ్చు.. కానీ బీజేపీ స్థాయి తగ్గుతుంది. టీఆర్ఎస్గా 2014లో 63 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చినం. 2018లో ఎన్నికలకు పోతే మా సంఖ్య 88 స్థానాలకు పెరిగింది. యూపీలో నేను గ్యారంటీగా చెప్తున్నా.. బీజేపీ స్థానాలు, బీజేపీ ఆదరణ తగ్గుతుంది. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ పతనానికి యూపీ ఎన్నికలే పునాది.
రాబోయే 25 ఏండ్ల కాలానికి అమృత కాల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. మీరేమంటారు?
వాళ్ల లెక్కలన్నీ బోగసే. 75 ఏండ్ల తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించుకొనేలా ఉన్నది.. 40 లక్షల కోట్లు దాటలేదు. 39 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. వీళ్లు సాధించే వాళ్లు కాదు. జీడీపీ లెక్కలన్నీ తప్పే. రెండు మూడు రోజుల్లో అంతా బయటపడుతుంది. గతేడాదితో పోల్చితే జీడీపీ తగ్గిందని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎస్ఎస్వోనే తెలిపింది.
ఈ నెల 5న మోదీ హైదరాబాద్ వస్తున్నారు.. మీరు కలుస్తారా?
మోదీని కలవడం ప్రొటోకాల్ అంతే. ప్రధాని హోదాలో వస్తున్నారు. పీఎంగా ఉన్న ఆయన ఏ రాష్ర్టానికి వెళితే ఆ రాష్ట్ర సీఎం వెల్కమ్ చెబుతారు. అది ఆటోమెటిక్గా జరిగేదే. అది ప్రొట్రోకాల్ రిక్వైర్మెంట్. అందుతో ప్రత్యేకత ఏం లేదు. రాజకీయంగా మాట్లాడటం నా పాలసీ. ప్రధానితో హెలికాప్టర్లో కూర్చున్నప్పుడు కూడా ఇదే మాట్లాడుతా. అది మా పాలసీ. ఏది చేస్తానో.. అదే చెబుతాను.