హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణసహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికలపై విజయాలను సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన నిఖత్.. వచ్చే ఒలింపిక్స్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం చెప్పారు. గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను నిఖత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకొనే శిక్షణ, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఖర్చుల కోసం రూ.2 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో క్రీడలశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్తోపాటు మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల సుమన్, విఠల్రెడ్డి, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, సీఎంవో కార్యదర్శి భూపాల్రెడ్డి, క్రీడలశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.