కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే రూ.100 కోట్లు విడుదలకు జీవో జారీచేయగా, ఆలయాన్ని పరిశీలించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం అంజన్న చెంతకు రానున్నారు. ఆలయ అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
జగిత్యాల, హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. అయితే, ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి వేల మంది భక్తులు వస్తారు. తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం కేసీఆర్.. తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకొన్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొండగట్టుకు చేరుకొంటారని వెల్లడించారు. స్వామివారిని దర్శించుకొని గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి గుడి, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలిస్తారని వివరించారు. అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తారని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ డిజైన్ల రూపకర్త, ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇప్పటికే రెండుసార్లు కొండగట్టు క్షేత్రాన్ని పరిశీలించారు. ఆయన గుట్ట అభివృద్ధికి ఒక నమూనాను రూపొందించినట్టు తెలుస్తున్నది. యాదగిరిగుట్టపై 3 ఎకరాల స్థలమే అందుబాటులో ఉండగా, కొండగట్టుపై 12 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నది. దీంతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు సమాచారం. వాస్తు ప్రకారం గుట్టపైకి ఈశాన్యం వైపు నుంచి రోడ్డును నిర్మించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ కొత్త మార్గాన్ని నిర్మించడం వీలుకాకపోతే ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును ఈశాన్యం వైపునకు మళ్లించాలని చూస్తున్నట్టు సమాచారం. గుట్టపై 125 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. స్వామివారి ఆలయ విస్తరణ, అనుబంధ నిర్మాణాలన్నీ కృష్ణ శిలతో చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.