జయశంకర్ భూపాలపల్లి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో మనకు వెలుగులు పంచేందుకు ప్రాణాలు పణంగా పెట్టి నల్లబంగారాన్ని వెలికితీసే సింగరేణి ఉద్యోగుల జీవితాల్లో నిత్యం కారు చీకట్లే. తమ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలన్నీ వృథానే. ఎలాంటి సంక్షేమ ప్రయోజనాలు అందక కార్మికుల కుటుంబాలు అత్యంత దుర్భర జీవనం సాగించాయి. కానీ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారి బతుకుల్లో వెలుగులు నింపారు. టీబీజీకేఎస్ కృషితో రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన ఎక్స్టర్నల్ ఉద్యోగాలకు మోక్షం లభించింది. మొత్తం 19,260 మందికి కారుణ్య, డిపెండెంట్, ఎక్స్టర్నల్ ఉద్యోగాలు లభించాయి.
సింగరేణిలోనే ప్రప్రథమంగా సింగరేణి కార్మికులకు సకల వసతులతో డబుల్ బెడ్రూం క్వార్టర్లను నిర్మించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పది హామీల్లో తొమ్మిది హామీలను నెరవేర్చారు. సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందం నింపారు. కానీ, ఇవన్నీ పక్కకు పెట్టి ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక బీఆర్ఎస్ సర్కారుపై అసత్య వార్తలు ప్రచురించింది. ‘బీఆర్ఎస్కు హామీల టెన్షన్’ అంటూ ప్రచురించిన దురుద్దేశ కథనంపై అటు సింగరేణి ఉద్యోగులు, ఇటు వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. స్వరాష్ట్రంలోనే తమకు సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్)తో న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. అనేక హక్కులు సాధించుకొన్నామని, సంక్షేమ ప్రయోజనాలు అందాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నో సమ్మెలు చేసి సాధించుకున్న తండ్రీకొడుకుల ఉద్యోగాలు నిలిచిపోగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారి కలను నెరవేర్చారు. ఇప్పటివరకూ సింగరేణిలో డిపెండెంట్, కారుణ్య నియామక ప్రక్రియల ద్వారా 15,053 సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు వచ్చా యి. రెండు దశబ్దాలుగా నిలిచిపోయిన ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు స్వరాష్ట్రంలో పునరుద్ధరించి 4,207 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు.
పైసా ఖర్చు లేకుండానే సింగరేణిలో మా నాన్న ఉద్యోగం నాకు కారుణ్య నియామకం కింద వచ్చింది. ఈ రోజే (గురువారం) ఉద్యోగ నియామక పత్రాన్ని జీఎం సార్ చేతుల మీదుగా అందుకున్నా. మా నాన్న గడ్డం రాజేశ్వర్ కేటీకే 8వ గనిలో ఫిట్టర్గా పని చేశాడు. గుండెజబ్బు వచ్చింది. 2022 మే నెలలో మెడికల్ అన్ఫిట్ అయ్యాడు. సీఎం కేసీఆర్ దయవల్లే మా నాన్న ఉద్యోగం ఈ రోజు నాకు వచ్చింది.
-గడ్డం భావన, కారుణ్య నియామక ఉద్యోగిని, భూపాలపల్లి
సింగరేణిలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చాం. బేసిక్పై ఒక్కశాతం కరెంటు చార్జీ మాఫీ, మహిళలకు ఉద్యోగాలు, బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్, 60 -61 ఏండ్లకు పదవీ విరమణ పెంపు, సీఎంపీఎఫ్ సంస్థ వాటా 12 శాతం చెల్లించేలా కృషి చేశాం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత కృషితో యూనియన్.. కార్మికులకు చేసిన మేలు ఇంతకుముందెన్నడూ ఎవ్వరూ చేయలేదు. కవిత ఆధ్వర్యంలోనే వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరుతాం. ఎవరికి ఏ అనుమానాలు అవసరం లేదు. కార్మికులు మమ్మల్ని ఆదరిస్తారు.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి ప్రధాన కార్యదర్శి