హనుమకొండ, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు. అందులో భాగంగానే ఆర్థికంగా చతికిలబడి అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మందికి ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలను ఇంటింటికీ వెళ్లి చెక్కుల రూపంలో అందజేశామన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వినూత్నంగా ‘చెట్టు-చెక్కు’ కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు సుమారు రూ.23 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మొక్కలతో కలిపి పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదన్నారు. చీఫ్ విప్ దాస్యం మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వేలాది మందికి కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించినట్టు తెలిపారు. చెకుతోపాటు మొక్కను అందుకొన్న లబ్ధిదారులు తప్పనిసరిగా నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి, సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.