హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి పోక్సో చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. పోక్సో చట్టంపై శనివారం తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ నిర్వహించిన సదస్సును ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. పోక్సో చట్టాన్ని మరింత కఠినతరం చేయడం ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత ఏర్పడుతుందని చెప్పారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ పొక్సో చట్టం అమలులో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని, ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 40 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నారు. చట్టం అమలుపై ప్రభుత్వ కృషిని పలువురు న్యాయమూర్తులు ప్రశంసించారని గుర్తు చేశారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని, అదనపు డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేకంగా షీటీమ్లు, భరోసా కేంద్రాలతో బాధిత కుటుంబాలకు, పిల్లలకు వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ అభిషేక్రెడ్డి, జస్టిస్ రాధారాణి, జస్టిస్ నంద, అదనపు డీజీ స్వాతిలక్రా, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యాదేవరాజన్, న్యాయశాఖ కార్యదర్శి ఎన్ నర్సింగరావు, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ తిరుమలాదేవి, సుజన, పలువురు సీనియర్ న్యాయ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.