హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదని ఎన్నికల సిబ్బందిని ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్రాజ్ హెచ్చరించారు. ఉప ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ రాజకీయ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ప్రత్యేక ప్రాధా న్యం ఇవ్వకూడదని, అధికారులు పూర్తిగా తటస్థంగా ఉండాలని సూచించారు. శనివారం ఆయన మునుగోడు నియోజకవర్గాన్ని సందర్శించారు. మునుగోడు సహా పలు గ్రామాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏవైనా ప్రలోభాలకు గురిచేస్తున్నాయా? గ్రామాల్లో పరిస్థితి శాంతియుతంగా ఉన్నదా? అని ఆరా తీశారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై 58 కేసులు నమోదు చేసి, 24 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మోడల్కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించేవారు ఎవరైనా సరే కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్భగవత్, ఎస్పీ రెమారాజేశ్వరిని ఆదేశించారు. నియమావళి ఉల్లంఘనలు, ఇతర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదులను 08692-230198 నంబర్లో తెలియజేయాలని సూచించారు.