హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం నిజమేనని ఆదాయపన్నుశాఖ తెలుగు రాష్ర్టాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలీ మధుస్మిత వెల్లడించారు. వేలాది మంది ఉద్యోగులు తప్పుడు పత్రాలు చూపి, అర్హతలేని క్లెయిమ్ల ద్వారా పన్ను రిఫండ్ పొందారని ఆమె తెలిపారు. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని ఆదాయపన్నుశాఖ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిథాలీ మధుస్మిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తప్పుడు రిటర్న్ దాఖలైనట్టు గుర్తించామని చెప్పారు. అర్హతలేని క్లెయిమ్ల ద్వారా పన్ను రీఫండ్, మినహాయింపు పొందినట్టు ఇప్పటికే ఆదాయపన్ను విభాగం గుర్తించిందని చెప్పారు.
ఇందులో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, ఇతర రాష్ర్టాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే తెలుగు రాష్ర్టాలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఈ తరహా తప్పుడు రీఫండ్లు కోరినట్టు ఐటీశాఖ దర్యాప్తులో తేలిందన్నారు. 2022-23లో తప్పుడు రీఫండ్లతో కూడిన రిటర్న్లు 84 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. తప్పుగా రీఫండ్లు కోరిన ఉద్యోగులకు సవరించిన రిటర్న్లు దాఖలు చేసేందుకు ఐటీశాఖ గడువు ఇచ్చినట్లు చెప్పారు. 2023 డిసెంబరు వరకు సవరించిన ఐటీ రిటర్న్ దాఖలు చేయొచ్చని చెప్పారు. ఆ తదుపరి 50 శాతం జరిమానాతో రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ తరహా కుంభకోణంపై ఐటీశాఖ దర్యాప్తు ముమ్మరం చేసిందని, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్తోపాటు ట్యాక్స్ పేయర్స్పై విచారణ జరుగుతున్నదని వెల్లడించారు.