ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చిదంబరం చిలుక పలుకులు పలుకుతున్నారని ఓయూ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుతో సిగ్గుపడుతున్నామని చెప్పారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో దాదాపు 1,200 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
‘తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వెనక్కి తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి’ అంటూ చిదంబరం చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే అధికారం దాహంతో కుట్రలు పన్నుతున్నారని విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలకు తెలంగాణలో అడ్రస్ లేకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరారు.