Chicken price | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చికెన్ ధరలు కొండెక్కాయి. ఎండల దాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా డిమాండ్ పెరిగి ధర అధికమైంది. నెల క్రితం వరకు కిలో రూ.200 ఉన్న బ్రాయిలర్ చికెన్ ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ.300 పలుకుతున్నది. స్కిన్లెస్ చికెన్ రూ.230 నుంచి రూ.320కి, లైవ్ చికెన్ ధర రూ.110 నుంచి రూ.160కి పెరిగింది. దీంతో కొనుగోళ్లు మందగించి చికెన్ అమ్మకాలు 50 శాతం మేరకు తగ్గాయని, మున్ముందు చికెన్ ధరలు మరింత పెరగవచ్చని వ్యాపారులు చెప్తున్నారు.
మరోవైపు ఎండల ప్రభావంతో కోడిగుడ్ల ఉత్పత్తి కూడా 20 శాతానికి తగ్గింది. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీల దాటితే కోళ్లు తట్టుకోలేవు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కోళ్లను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతున్నదని లేదని రైతులు వాపోతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు 6 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. ఈసారి వడగాడ్పుల తీవ్రత తారాస్థాయికి చేరడంతో 16 శాతానికిపైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని కోళ్ల ఫారాల నుంచి పొరుగు రాష్ర్టాలకు ఎగుమతులు పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా కోళ్ల లభ్యత తగ్గిపోయింది.