నారాయణపూర్, నవంబర్ 4: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేత ఒకరు శనివారం పట్టపగలు హత్యకు గురయ్యారు. నారాయణపూర్ జిల్లాలో రతన్ దూబే అనే బీజేపీ నేతను శనివారం నక్సల్స్ పదునైన ఆయుధంతో నరికి హత్య చేశారు.
నారాయణపూర్ బీజేపీ జిల్లా యూనిట్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రతన్ దూబే కుషాల్నగర్ గ్రామం మార్కెట్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా నక్సలైట్లుగా అనుమానిస్తున్న కొందరు హత్యచేశారు. తమ పార్టీ నేతలను హత్య చేయడానికి అధికార కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదని ఇటీవల విపక్ష బీజేపీ నేతలు ఆరోపించిన క్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాగా గత నెల 20న కూడా బీజేపీ కార్యకర్త బిర్జు తరమ్ను కొందరు నక్సల్స్ కాల్చి చంపారు.