సిద్దిపేట, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ ప్రజలు గర్జించారు. చేర్యాల పట్టణంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నేత, సీఎం కేసీఆర్ను చూడటానికి, ఆయన ప్రసంగం వినడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. గులాబీ జెండాలను చేతబట్టి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల నుంచి డప్పుచప్పుళ్లతో ఆటపాటలతో సందడి చేసుకుంటూ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలుగా చేర్యాల బాటపట్టారు. చేర్యాల చరిత్రలలోనే కనివిని ఎరుగని రీతిలో సభ జరిగిందని విశ్లేషకుల అంచనా. మండుటెండను సైతం లెక్క చేయకుండా 2 గంటల నుంచే సభాప్రాంగణానికి భారీగా తరలివచ్చారు. 3:30 గంటలకే సభాప్రాంగంణం పూర్తిగా నిండిపోయింది. భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి 42 నిముషాలపాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు.
తన సొంతూరికి వచ్చినట్టు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. చేర్యాల సభ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఆద్యం తం పుల్ జోష్ను నింపింది. ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెలలో ఈ సభ గుబులు పుట్టించింది. మిట్టపల్లి సురేందర్, దరువు ఎల్ల న్న కళాకారుల బృందాల ఆటపాటలు ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. గులాబీ జెండాలు ఊపుతూ నృత్యాలు చేశారు. గులాబీల జెండలే రామక్క, జబ్బకు సంచి చేతుల జెండా, చంచల్గూడ జైలులో చంద్రవంకలు.. తదితర పాటలతో కళాకారులు సభను హోరెత్తించారు. సీఎం కేసీఆర్ సభకు చేరుకోగానే సభలో గులాబీల పూల వర్షం కురిసింది. ఎటూచూసిన గులాబీ జెండా రెపరెపలతో సభ అంతా గులాబీమయంగా మారింది.
కేసీఆర్ ప్రసంగానికి సభలోని జనం నుంచి ఆద్యంతం అపూర్వ స్పందన లభించింది. కేసీఆర్ సామెతలు, చలోక్తులకు జనమంతా చప్పట్లతో కేరింతలు కొట్టారు. ‘సూరును సదురుకోనోడు.. సూర్యున్ని తెస్తనన్నడం ట..ఎనకటికి ఒకడు’. కాంగ్రెస్ నాయకుల తీరు కూడా అదే మాదిరిగా ఉంది.. కాంగ్రెస్ పాలిత రాష్ర్టా ల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని ఆ పార్టీ నాయకులు మో సం చేస్తున్నట్టు కేసీఆర్ వివరించారు. ‘సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు..’ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకుండా ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసి ఇప్పుడు లపంగ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘తీర్థం పొదాం రా తిమ్మక్క అంటే నీవు గుళ్లే.. నేను సల్లే’ అన్న విధంగా కాంగ్రెస్ నాయకుల హామీలకు మోసపూతే గోస పడుతామని తెలిపారు.
చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తానని, ఇంజినీరింగ్ కాలేజీతోపాటు ఈ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం ప్రకటించగానే జనమంతా హర్షధ్వానాలతో ‘జై కేసీఆర్’ అంటూ మిన్నంటేలా నినదించారు. పదేండ్లలో జరిగిన అభివృద్ధి, ప్రతిపక్ష పార్టీల కుట్రల వంటి అంశాలను విపులంగా చెప్పడంతో సభలోని జనమంతా ఎంతో ఆసక్తిగా ఆలకించారు. సంక్షేమ పథకాలు ఉండాలా.. వద్దా అని సీఎం కేసీఆర్ ప్రశ్నకు ఉండాలి.. అంటూ చేతులెత్తి మద్దతు పలికారు. వివిధ ఊర్ల పేర్లను ఉటంకించిన సమయంలో ప్రజలు లేసి గంతులేశారు.