వేములవాడ, ఆగస్టు 31: ప్రజాసమస్యల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు చెన్నమనేని రాజేశ్వర్రావు అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్లాఘించారు. బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. వ్యవసాయరంగ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని సంగీత నిలయంలో నిర్వహించిన రాజేశ్వరరావు శతజయంత్యుత్సవాల్లో మంత్రి కొప్పల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నమనేని జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. కమ్యూనిస్టు నేతగా, గొప్ప మేధావిగా రాష్ట్ర, జాతీయస్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని కీర్తించారు. ఉన్నత సామాజికవర్గంలో జన్మించి పీడితుల అభ్యున్నతికి కృషి చేశారని, వారి కోసం జైలు జీవితం కూడా గడిపారని గుర్తుచేశారు. చెన్నమనేని కుటుంబం నుంచి రాజేశ్వర్రావు, విద్యాసాగర్రావు, హనుమంతరావు లాంటి నాయకులు సమాజానికి ఎనలేని సేవలందించారని చెప్పారు. వినోద్కుమార్ మాట్లాడుతూ..
గోదావరి జలాలను ఎత్తిపోసి బీడు భూములను సస్యశ్యామలంగా మార్చాలని 50 ఏండ్ల క్రితమే కలగన్న గొప్ప నాయకుడు చెన్నమనేని రాజేశ్వర్రావు అని పేర్కొన్నారు. నైజాం, జమీందార్ల పాలనకు వ్యతిరేకంగా చిన్నతనంలోనే ఉద్యమించిన పోరాట యోధుడని తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ బలహీన వర్గానికి చెందిన తనకు లోక్సభలో అడుగుపెట్టే అవకాశం ఆరోజుల్లో రావడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి చెన్నమనేని రాజేశ్వర్రావు అని గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్బాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్యాకేజీ-9కు రాజేశ్వరరావు పేరు పెట్టి తమ నాన్నగారికి అరుదైన గౌరవం ఇచ్చారని కొనియాడారు. కేంద్రం రాజేశ్వరరావు పేరిట పోస్టల్ స్టాంపులు కూడా ముద్రించనుందని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలను పుస్తక రూపంలో ముద్రించామని, పోస్టల్ స్టాంప్తో కలిపి అక్టోబర్లో హైదరాబాదులో ఆవిషరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చికాల రామారావు, జనశక్తి అగ్ర నేత కూర రాజన్న, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా.. రాఖీ పండుగను పురస్కరించుకొని వేములవాడ పట్టణానికి చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుకు రాఖీలు కట్టారు. ఇందులో రుద్రంగి మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ జమీలాబేగం రాఖీ కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. మతసామరస్యాన్ని చాటిన ఆమెను పలువురు అభినందించారు.