ఆదిలాబాద్ : గిరిజనులలో విద్యతోనే మార్పు సాధ్యమని ఆదిలబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇలా అన్ని వర్గాలకు కార్పొరేట్ విద్య అందేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామ పంచాయతీలోని సిరికొండ గ్రామంలో ఎంపీటీసీ నిధుల నుండి రెండున్నర లక్షలతో నిర్మించే డ్రైనేజీ పనులకు గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ పనులను ప్రారంభించారు. గ్రామస్థులతో మాట్లాడి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గిరిజనుల కష్టాలను అర్థం చేసుకొని వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి అని తెలిపారు. నేడు ఆదివాసి, గిరిజన గ్రామాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ గిరిజన విద్యార్థుల భవిష్యత్తును వారి జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించారని తెలిపారు.
కేంద్రoలోని బిజెపి ప్రభుత్వం ఆదిలాబాద్ లోని పరిశ్రమల ఆస్తులను అమ్ముకోవడంలో చూపించే ఉత్సాహం, గిరిజనుల అభ్యున్నతికి పాటుపడడంలో చూపించడం లేదని విమర్శించారు. ఇలాంటి తరుణంలోనే గిరిజనులు చైతన్యం కావాలంటే విద్య అనే ఆయుధాన్ని వాడుకోవాలని గిరిజనులకు ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల విద్యాభివృద్ధకి కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కార్పొరేట్ విద్యను గ్రామ స్థాయిలో కి తీసుకెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మండల అధ్యక్షుడు కొడప సోనే రావు, ఎంపీపీ మడావి నాగు బాయ్ కిషన్, సర్పంచ్ భూమన్న, సేవా లక్ష్మీ, జగదీష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.