KCR | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావును సోమవారం మాజీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు కేసీఆర్ను పరామర్శించారు. ఉదయం నుంచి రాత్రి దాకా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నేతలు కేసీఆర్ను పరామర్శించి ఆయన త్వరగా కోలుకొని ప్రజాజీవితంలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రోజంతా దవాఖానకు వచ్చే ప్రముఖులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికి కేసీఆర్ ఆరోగ్య వివరాలను వారికి వివరించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజాజీవితంలోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు సోమాజిగూడలోని యశోద దవాఖానకు చేరుకున్నారు. ఆయనను కేటీఆర్ తోడ్కొని వెళ్లారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లిన చంద్రబాబు.. ఆయన ఆరోగ్యం గురించి అడిగారు. ఆరోగ్యస్థితిగతులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
24 గంటల్లో నడక గ్రేట్: చిరంజీవి, ప్రకాశ్రాజ్
కేసీఆర్ తిరిగి సాధారణ స్థితిలోకి రావాలని సినీ నటుడు చిరంజీవి, ప్రకాశ్రాజ్ ఆకాంక్షించారు. తుం టి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన 24 గంటల్లోపే వైద్యులు కేసీఆర్ను నడిపించటంలో వైద్యులు అభినందనీయపాత్ర పోషించారన్నారు. కేసీఆర్ చికి త్స పొందుతూ కూడా సినీ పరిశ్రమ ఎలా ఉన్నదని ఆరా తీయయటం వారి దార్శనికతకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన కేసీఆర్ సర్వదా ఆదర్శవాది అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఆదర్శవాది: చంద్రశేఖర్ ఆజాద్
ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదర్శవాది అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ భారతానికి సంక్షేమ వారధి కట్టిన గొప్ప దార్శనిక పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ త్వరగా కోలుకొని పీడితుల గొంతుగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. దవాఖానలో ఉండి కూడా తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారని ఉదహరించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాజీవితంలోకి అదే ఉత్సాహంతో రావాలని బీఎస్సీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆకాంక్షించారు.
కోలుకుంటున్నారు: భట్టి విక్రమార్క
కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. హిప్ మార్పిడి జరిగిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోలుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. వారు త్వరగా కోలుకొని ప్రజాజీవితంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
కేసీఆర్ను పరామర్శించిన వారిలో..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, నమస్తే తెలంగాణ సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, ఎంపీలు రంజిత్రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శంభీపూర్రాజు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, వీ శ్రీనివాస్గౌడ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు కేవీ వివేకానంద్, బీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, నెమరుగొమ్ముల సుధాకర్రావు, బాజిరెడ్డి గోవర్ధన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాల్క సుమన్, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ బిందు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, మేడె రాజీవ్సాగర్, రావుల శ్రీధర్రెడ్డి, రజనీ సాయిచంద్, బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరులు దవాఖానలో కేసీఆర్ను పరామర్శించారు.
కేసీఆర్ కోసం ఏపీలో పూజలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్లో పార్టీ నాయకులు సోమవారం పూజలు నిర్వహించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని సింహాచల ఆలయంలో శ్రీవరమహాలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తలారి సురేశ్ ఆధ్వర్యంలో ఈ పూజలు కొనసాగాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.