హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రెండు రాష్ర్టాలను కలుపాలంటూ వైసీపీ నేతలు మాట్లాడితే.. తెలంగాణలో మళ్లీ రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారు. మరోసారి తెలంగాణ ప్రజల జీవితాల్లో విషం చిమ్మేందుకు కుతంత్రాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టినా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కానట్టుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏమీ చేయలేక.. చంద్రబాబు తన భవిష్యత్తు, తన కొడుకు లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలను బలిపెట్టే కుట్రలకు తెరలేపుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీని వదిలిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని చంద్రబాబు పిలుపునివ్వడం గమనార్హం. తెలంగాణకు టీడీపీ చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఓటుకు నోటుతో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే ముల్లెమూట సర్దుకొని పారిపోయిన వాళ్లు మళ్లీ తెలంగాణలోకి వస్తే సహించేంది లేదని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
పాడిందే పాటరా.. అన్నట్టు హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు మరోసారి పాత పల్లవే ఎత్తుకున్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ను అభివృద్ధి చేయకపోతే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదా? అన్నారు. ఇక రైతులపై ఆయన సవతి తల్లి ప్రేమను ఒలకపోశారు. గతంలో వ్యవసాయం దండగ అన్న ఆయనే.. ఇప్పుడు రైతులను విస్మరించబోం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడం గమనార్హం. అదేవిధంగా తెలంగాణలో రైతులు గోస పడుతున్నారని, పంటలకు మద్దతు ధర దక్కడం లేదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఆయన ఏపీ పరిస్థితిని ఊహించుకొని ఇక్కడ కూడా అదే మాదిరిగా ఉందనుకున్నారేమో అంటూ రైతులు, ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా అత్యధిక ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేననే విషయం తెలుసుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. అదేవిధంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలతో రైతులకు మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు బాగా చేస్తుందని అంటూనే మళ్లీ రాజకీయం కోసం విమర్శలు చేయడం గమనార్హం.