YS Jagan | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను నడిపిస్తున్నది తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీ రిమోట్లు చంద్రబాబు వద్దనే ఉన్నాయని ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కడప లోక్సభ స్థానంలో తన చెల్లెలు పోటీ చేయడంపై తనకు ఎటువంటి బాధ లేదని అన్నారు.
అయితే ఆమె డిపాజిట్ కూడా దక్కించుకోదేమోనన్న బాధ ఎక్కువగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో తన తండ్రి పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిల పనిచేయడం తనకు ఆవేదనగా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుతోనే కాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో కూడా తాను పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు.