హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ 30, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంద ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారంనాటి తూర్పుగాలుల్లో ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి అంతర్గత మహారాష్ట్ర మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించిన ఉపరితల ద్రోణి గురువారం బలహీన పడినట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒకటి రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 30, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొన్నది. శనివారం ఈదురుగాలులు, ఉరుములతోపాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. గురువారం ములుగు జిల్లా తాడ్వాయిలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.