హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : అత్యుత్తమ కాలేజీలు, మంచి పనితీరు కనబరుస్తున్న సంస్థలు ఆఫ్ క్యాంపస్ (ప్రస్తుతం ఉన్న క్యాంపస్తోపాటు మరో క్యాంపస్)లను నిర్వహించుకోవచ్చు. విద్యాసంస్థ నడుస్తున్న పట్టణం లేదా నగరంతో పాటు అనుబంధ వర్సిటీ పరిధిలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వచ్చే విద్యాసంవత్సరం నుంచి అనుమతులివ్వనున్నది.
ఇక ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషన్స్ తమ నైపుణ్యాలు పెంచుకొనేందుకు డిప్లొమా, డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరి.. తమ చదువులను పూర్తిచేసుకోవచ్చు. ఇందుకోసం కాలేజీలు ప్రత్యేకంగా కోర్సులను నిర్వహిస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలో కూడిన అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్ను ఏఐసీటీఈ బుధవారం విడుదల చేసింది. దీనిప్రకారం 2024 -27 విద్యాసంవత్సరాలకు కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐడియా డెవలప్మెంట్ ఎవల్యూషన్ అండ్ అప్లికేషన్ (ఐడియా) ల్యాబ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.