Chanaka-Korata | హైదరాబాద్/ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ప్రజల నాలుగు దశాబ్దాల కల స్వరాష్ట్రంలో సాకారమైంది. సీఎం కేసీఆర్ చొరవతో నల్లరేగళ్ల దాహార్తి తీరనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో చనాక- కొరాట ప్రాజెక్టు (సీకేబీ) వెట్రన్ అధికారులు గురువారం విజయంతంగా నిర్వహించారు. బుధవారం డ్రైరన్ పూర్తి చేసిన అధికారులు మరుసటిరోజే వెట్రన్ను సక్సెస్ చేశారు. ప్రస్తుతం సీకేబీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే బరాజ్ నిర్మాణం, గేట్ల నిర్మాణం పూర్తయింది. సైడ్వాల్స్ నిర్మాణ పనులను కూడా పూర్తిచేశారు. హత్తీఘాట్ వద్ద పంప్హౌజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మొత్తంగా మూడు 5.5, మూడు 12 మెగావాట్ల మోటర్లను ఏర్పాటు చేశారు. అధికారులు 5.5 మెగావాట్ల మోటర్ల డ్రైరన్ను ఇటీవలే నిర్వహించారు. ఇప్పటికే కాలువ నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే లోయర్ పెన్గంగా కెనాల్కు సంబంధించి డీ14, డీ15, డీ16 కాలువలు పూర్తికాగా, దాని కింద 5వేల ఎకరాలు ఉన్నాయి.
ఈ సీజన్లోనే ఆ ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలనే డ్రైరన్ను నిర్వహించగా అది విజయవంతమైంది. తాజాగా గురువారం రోజున వెట్రన్ను కూడా నిర్వహించగా, అది విజయమైంది. త్వరలోనే ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని జైనథ్ మండలం కొరాట వద్ద పెన్గంగా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో 52 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.. ఈ కార్యక్రమంలో ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ పీ రాము, ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వర్రావు, ఈఈ రవీందర్, ట్రాన్స్కోఅధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టు అనగానే అంతర్రాష్ట్ర జలవివాదాలు.. తెలంగాణ ప్రాజెక్టు అంటేనే పర్యావరణ అభ్యంతరాలు.. తెలంగాణ ప్రాజెక్టు అంటేనే నీటి లభ్యతపై అనుమానాలు.. ఏండ్లకేండ్లుగా కొనసాగే సర్వేలు. ఇదీ ఉమ్మడి పాలనలో దుస్థితి. అందుకు పెన్గంగాపై ప్రతిపాదించిన ప్రాజెక్టులే నిలువెత్తు నిదర్శనం. కారణం గోదావరి గలగల అంటూ ఆంధ్రాకు తరలిపోవడమే లక్ష్యం. స్వరాష్ట్రంలో తెలంగాణ ఆ కనిపించని కుట్రలను చేధించింది. సీఎం కేసీఆర్ దీక్షాదక్షతలతో నేడు దశాబ్దాల కలలను సాకారం చేసుకొంటున్నది. నాటి పాలకులు వృథా చేసిన నిధులను సద్వినియోగం చేసుకొంటూ, అటకెక్కించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తూ బీళ్లకు నీళ్లను మళ్లిస్తున్నది. అందుకు చనాక కొరాట బరాజ్ మరో నిదర్శనం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ జలవిజయానికి తార్కాణం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ ప్రాంతం. అందులోనూ అత్యంత వెనకబడిన బేల, జైనథ్, ఆదిలాబాద్, తాంసీ, భీంపూర్ మండలాలు. ఎటు చూసినా బంగారు పంటలు పండించగలిగిన నల్లరేగడి భూములు. చుట్టూ గుట్టలు. బోరువేద్దామన్నా, బావి తవ్వుదామన్నా అంతటా రాతిపొరలు. ఎవుసానికి ప్రధాన ఆధారం వర్షం. ఈ నేపథ్యంలో కేవలం 5 టీఎంసీలు అందిస్తే దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుకొని జీవితాన్ని గడపాలనేది అక్కడి రైతుల ఆకాంక్ష. ఆ ఆశలతోనే ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా ఆడుకున్నారు. లోయర్ పెన్గంగా ప్రాజెక్టు పేరిట ఓట్లు దండుకొన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్గంగాపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెన్గంగాపై గతంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో మరోసారి సమగ్రమైన ఒప్పందం చేసుకొన్నారు. లోయర్ పెన్గంగా ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాక కొరాట బరాజ్ నుంచి నీటిని వినియోగించుకొనేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. అక్కడితో ఆగకుండా ఒప్పందంలో భాగంగా నిర్మించాల్సిన చనాక కొరాట బరాజ్ నిర్మాణానికి రూ.368 కోట్లతో, లోయర్పెన్గంగా ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.1,227 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. ఉమ్మడి పాలకులు నాలుగు దశాబ్దాలుగా పూర్తిచేయలేని కలను సీఎం కేసీఆర్ ఆరేండ్లలోనే సాకారం చేశారు.
గోదావరి సబ్బేసిన్ జీ7లో పెన్గంగా నదిపై మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఘటాంజీ తాలుకాలోని తడనవాలి గ్రామం వద్ద 42.67 టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్గంగా డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. దాని నుంచి వచ్చే కుడి కాలువ ద్వారా మహారాష్ట్ర నీటిని వినియోగించుకోవాలి. మొత్తంగా 89 కిలోమీటర్ల పొడవు ఉంటే ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 47,520 ఎకరాలకు సాగునీరందించాలి. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. డ్యామ్ నిర్మాణం పూర్తికావడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాత్కాలికంగా ఎల్పీపీ కింద ఉన్న ఆయకట్టుకు సైతం చనాక కొరాట బరాజ్ (సీకేబీ) ద్వారా సాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. సీకేబీ ఆయకట్టుకు, ఎల్పీపీ ఆయకట్టు కోసం వేర్వేరుగా హత్తీఘాట్ వద్ద పంప్హౌజ్లో మోటర్లు ఏర్పాటు చేశారు. పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి ఎల్పీపీ కెనాల్లో పోయనున్నారు.
తొలిదశలో 5.5 మెగావాట్ల పంపులతో నీటిని తోడి 44 కిలోమీటర్లు దూరంలో ఉన్న లోయర్ పెన్గంగా కెనాల్లో 44వ కిలో మీటర్ పాయింట్ వద్ద పోయనున్నారు. అక్కడి నుంచి దిగువన 89వ కిలో మీటర్ వరకు ఉన్న 37,520 ఆయకట్టుకు నీరందించనున్నారు. అందుకోసం పిప్పల్కోట్ వద్ద రిజర్వాయర్ను నిర్మించారు. ఇక రెండో దశలో గోమూత్రి వద్ద రిజర్వాయర్ను నిర్మించి కెనాల్లో 44-0 కిలోమీటర్ వరకు ఉన్న 10వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రణాళికలు రూపొందించడంతోపాటు ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. దీంతో మొత్తంగా లోయర్ పెన్గంగా డ్యాం పూర్తయ్యేంతవరకు దాని కింద ఉన్న మొత్తం 47,520 ఎకరాలకు సీకేబీ ద్వారా సాగునీరందనున్నది. ఇక 12 మెగావాట్ల మోటర్లతో నీటిని 115 మీటర్లకు ఎత్తి సీకేబీ కాలువలో పోయనున్నారు. 19 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువల కింద మొత్తంగా 13,500 ఎకరాలకు సాగునీరందించనున్నారు. మొత్తంగా సీకేబీ ద్వారా 61,020 ఎకరాలకు నీరందించడంతోపాటు బేల, జైనథ్, ఆదిలాబాద్, తాంసీ మండలాల పరిధిలోని 38 గ్రామాలకు తాగునీరందించేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.
చనాక-కొరాట ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విభాగాల నుంచి అనుమతుల ప్రక్రియ ఇప్పటికే సంపూర్ణంగా ముగిసింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచీ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకుసాగింది. అనేక అధ్యయనాలు, క్షేత్రస్థాయిలో పరిశీలనలను సాగించి మొత్తంగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రెండేండ్లుగా ఇంజినీరింగ్ అధికారులు చేసిన అవిశ్రాంత కృషితో ప్రాజెక్టు ప్రారంభానికి ముందే అనుమతులు సాధించడం గర్వకారణం. పెన్గంగాపై గతంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో సమగ్రమైన ఒప్పందం చేసుకోవడంతోపాటు లోయర్ పెన్గంగా ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాక -కొరాట బరాజ్ నుంచి నీటిని వినియోగించుకొనేందుకు మహారాష్ట్రను సీఎం కేసీఆర్ ఒప్పించారు. కేంద్ర ప్రభుత్వం జూలై 2021లో జారీచేసిన రివర్ బోర్డుల గెజిట్ను అనుసరించి అనుమతులు లేని ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు పొందాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చనాక -కొరాట ప్రాజెక్టు డీపీఆర్లను అదే ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జలసంఘంలో భాగమైన వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్లను కూలంకషంగా పరిశీలించడంతోపాటు ఆమోదం తెలిపాయి. చిట్టచివరిగా పర్యావరణ అనుమతులను సాధించడం మాత్రమే మిగిలిపోయింది. కానీ మహారాష్ట్ర మాత్రం ఒప్పందంలో భాగంగా తన పోర్షన్కు సంబంధించిన పనులకు ఇప్పటికీ కనీసం పరిపాలన అనుమతులను కూడా మంజూరు చేయలేదు. అదీగాక 0.5 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులను కూడా తీసుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడానికి అడ్డంకిగా మారింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు ఈఎన్సీ హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఇతర ఇంజినీరింగ్ అధికారులు దాదాపు రెండేండ్లుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
మహారాష్ట్రతో సంబంధం లేకుండా తాము చేపట్టిన 80 శాతం పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, గతంలోనూ తెలంగాణ, మహారాష్ట్ర రాష్ర్టాలు చేపట్టిన ఉమ్మడి ప్రాజెక్టులకు వేర్వేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయని, అందుకు లోయర్ పెన్గంగా ప్రాజెక్టే నిదర్శనమని సోదాహరణంగా వాదనలు వినిపించారు. తుదకు కేంద్ర పర్యావరణ అనుమతులు సాధించారు. దీంతో టీఏసీ సాధనకు మార్గం సుగమమైంది. నిరుడు నవంబర్లో కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ సెక్రటరీ అధ్యక్షతన కొనసాగిన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా.. అనుమతులు ప్రక్రియ సంపూర్ణమయింది.
ఉమ్మడి ప్రభుత్వం లోయర్ పెన్గంగా ప్రాజెక్టు, కాలువ నిర్మాణానికి సంబంధించి సర్వేల కోసం దాదాపు రూ.62 లక్షలకు పైగా ఖర్చుచేసింది. సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రణాళికతో ఆ నిధులన్నీ నేడు సద్వినియోగమయ్యాయి. అదీగాక దుమ్ముగూడెం టెయిల్పాండ్ కోసం ఉమ్మడి ప్రభుత్వం 2006లో దాదాపు రూ.100 కోట్లకు పైగా నిధులను వెచ్చించి బ్రెజిల్ నుంచి మోటర్లను దిగుమతి చేసుకొన్నది. నాటి నుంచి ఆ మోటర్లు నిరుపయోగంగానే మిగిలిలాయి. ఆ మోటర్లనే లోయర్ పెన్గంగా ప్రాజెక్టులో అమర్చారు. ఆ విధంగానూ తెలంగాణ ప్రభుత్వం నిధులను మిగిల్చింది.
ఒప్పందం 1 : తేదీ: 1978, ఆగస్టు7
అంశం: పెన్గంగా నదిలో లభ్యమయ్యే మొత్తం నీటిలో 80.31 టీఎంసీలను మినహాయించగా దిగువకు వచ్చే 42.67 టీఎంసీలను ఉమ్మడిగా వినియోగించుకొనేందుకు మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తొలిసారిగా అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందం చేసుకొన్నాయి.
ఫలితం: ఇరు రాష్ర్టాలు చొరవ చూపకపోవడంతో ప్రాజెక్టు అటకెక్కింది.
తేదీ:1998, డిసెంబర్ 10. మహారాష్ట్రలో..
ఒప్పందం: పెన్గంగా నదిపై యావత్మాల్ జిల్లా ఘటాంజీ తాలుకా వద్ద తడనవాలీ గ్రామం వద్ద 42.66 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడిగా డ్యామ్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు. 88ః12 నిష్పత్తిలో మహారాష్ట్ర (37.55 టీఎంసీలు), ఉమ్మడి ఏపీ రాష్ట్రం (5.12 టీఎంసీలు) జలాలను వినియోగించుకోవడంతోపాటు ఖర్చును భరించేందుకు మరోసారి ఇరు రాష్ర్టాల ఒప్పందం.
ఫలితం: శూన్యం. కాగితాలకే పరిమితమైంది. కానీ సర్వేల కోసం అప్పటికే రూ.62 లక్షల నిధులను మాత్రం ఖర్చు చేశారు.
తేదీ: 2012, డిసెంబర్ 1
ఒప్పందం: లోయర్ పెన్గంగా ప్రాజెక్టు ముందుకు సాగని నేపథ్యంలో దానికి దిగువన మొత్తంగా 3.70 టీఎంసీల సామర్థ్యంతో మూడు బరాజ్లను నిర్మించా లని ఇరు రాష్ర్టాలు మరో ఒప్పందం చేసుకొన్నాయి.
ఫలితం: తెలంగాణ ఏర్పాటు వరకూ ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.
తేదీ: 2016, మార్చి 8
ఒప్పందం: పెన్గంగాపై గతంలో ప్రతిపాదించిన అన్ని లోయర్ పెన్గంగా ప్రాజెక్టుతోపాటు దాని దిగువన నాలుగు బరాజ్ల నిర్మాణానికి మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు ఒప్పందం. మూడు బరాజ్లను మహారాష్ట్ర, ఒక బరాజ్ను తెలంగాణ నిర్మించాలి.
అమలు: ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చనాక కొరాట బరాజ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మహారాష్ట్ర 3 బరా జ్ల నిర్మాణానికి ఇప్పటికీ అనుమ తులను కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.