హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు, అటవీ సంరక్షణ నియమాల ఉపసంహరణను డిమాండ్ చేస్తూ రైతులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో 26న చలో రాజ్భవన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. హైదరాబాద్లో గురువారం జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం అనంతరం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికి పైగా ఆందోళన చేసి కేంద్రం మెడలు వంచి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరింపజేశారని అన్నారు.
ఆ సందర్భంగా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. ఆదివాసీలు, అటవీ నివాసుల హకులను కాలరాస్తూ అడవులను, భూగర్భవనరులను దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఆదివాసీలను భూములనుంచి తరిమివేయడానికి అటవీ సంరక్షణ నియమాలు-2022ను తెచ్చారని ఆరోపించారు. ఈ విధానం అడవుల వినాశనానికి, పర్యావరణం, జీవావరణం దెబ్బతినడానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని, అటవీ సంరక్షణ నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం చలో రాజ్భవన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో పశ్య పద్మ, సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య, బాలమల్లేశ్, రమావత్ అంజయ్య నాయక్, శ్రీరామ్నాయక్, రాయల చంద్రశేఖర్, ప్రసా ద్, వసుకుల మట్టయ్య, మండవ వెంకన్న, జీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.