హైదరాబాద్ : టెట్ (TET) వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీ (DSC)ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ (Chalo Hyderabad) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) తెలిపారు. డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించడం అనవాయితీగా వస్తుందని, పక్క రాష్ట్రాల్లో టెట్ వేసిన విషయం ప్రభుత్వం గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత రాదని, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెట్ నిర్వహించాలని కోరారు. టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. టెట్ నిర్వహించి ఆరు నెలలు అవుతుందని, అందులో పది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఈ నేపధ్యంలో మరోమారు టెట్ నిర్వహించాలని కోరారు.
గతంలో పోస్టులు తక్కువగా ఉండటం, సిలబస్ ( Syllabus) మారడం వల్ల చాలా మంది అర్హత సాధించలేకపోయారని పేర్కొన్నారు. బీఈడీ, డీఈడీ(BEd and DEd) పాసైన నిరుద్యోగులు టెట్ వేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఒక అవకాశం కోల్పోతామనే ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 24 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉంటే కేవలం 11 వేల పోస్టులతో భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. 24 వేల టీచర్ పోస్టుల భర్తీ, టెట్ వేసి డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్తో 11న ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు.