ములుగు, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి నదిలో కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందాకు వ్యతిరేకంగా త్వరలో ‘చలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి రహదారులను దిగ్బంధిస్తామని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏరువ సతీశ్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీతమ్మసాగర్ డీ సిల్టింగ్ పేరుతో మంత్రుల అక్రమ ఇసుక రవాణాపై ఆధారాలు సహా కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసి వారం రోజులవుతున్నా స్పందన లేదని అన్నారు. మంత్రుల అక్రమాల గుట్టు రట్టవుతుందనే అధికారులు మౌనం దాల్చుతున్నారని మండిపడ్డారు. అధికారులు ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. మంత్రుల అక్రమాలు వెలుగులోకి వస్తాయనే అధికారులు అటువైపు వెళ్లడం లేదని ఆరోపించారు. అధికారులు అనధికారికంగా అనుమతులివ్వడమే కాకుండా అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా మీన మేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. భూగర్భజలాలు అడుగంటుతాయని రైతులు ఆందోళన చెందుతున్నా అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదని మండిపడ్డారు. కాసులకు కక్కుర్తిపడి అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా? లేదా మంత్రులకు భయపడి సహకరిస్తున్నారో తేలాల్సి ఉన్నదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టకపోతే బీఆర్ఎస్ పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని, త్వరలో ‘చలో గోదావరి’ చేపట్టి రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
పల్లెవెలుగుకు ఎక్స్ప్రెస్ కలరింగ్
పల్లె వెలుగు బస్సులకు పెయింటింగ్ వేసి..ఎక్స్ప్రెస్గా మార్చి ప్రయాణికులను ఏమార్చుతున్న తీరును కార్పొ రేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆదివారం ఎక్స్ వేదికగా ఎండగట్టారు. సీఎం రేవంత్రెడ్డి పూర్వపు అనుభవాన్ని వినియోగించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తన పోస్ట్కు ఎక్స్ప్రెస్గా మార్చుతున్న బస్సు ఫొటోను జతచేసి ‘మసిబూసి మారేడుకాయ చేయడం అంటే ఇదేనని దెప్పిపొడిచారు.