హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీ, మహిళా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఈ నెల 21న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ దేశంలో జరిగే అభివృద్ధి గురించే కాదని, దేశ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసమూ చర్చించాలని డిమాండ్ చేశారు.
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ను ముందుకు తెస్తున్న బీజేపీకి ఈ నేషన్లో భాగమైన బీసీల బతుకుల గురించి పట్టదా? అని ప్రశ్నించారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, మహిళా బిల్లుతో మహిళలకు రాజకీయాలతోపాటు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తప్పనిసరిగా బీసీ, మహిళా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.