మహబూబ్నగర్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఉన్న తెలంగాణ వైతాళికురాలు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆ మహనీయురాలి జయంతి వేడుకలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ..రజాకార్లు, విస్నూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు ఐలమ్మ అన్నారు. ఆమె స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కట్టా రవి కిషన్ రెడ్డి, కౌన్సిలర్ గోవిందు, నాయకులు నవ కాంత్, చంద్రశేఖర్, రామకృష్ణ, నగేష్, మేదరి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెంకట్ రాములు, తదితరులు పాల్గొన్నారు.