హైదరాబాద్/ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బహుజన పోరాటయోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సముచిత గౌరవం దక్కుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. చిట్యాల ఐలమ్మ 127వ జయంతి వేడుకలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కోసం నిజాంకు వ్యతిరేకంగా బందూకు చేతబట్టి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని సాగించారని అన్నారు. ఐలమ్మ కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, యావత్ తెలంగాణ జాతి ఆస్తి అని పేర్కొన్నారు. పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంతా సంఘటితంగా ఉండి విచ్ఛిన్నకర శక్తుల దురాగతాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రభాగంలో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అందరూ అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవం కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్కు మరెవరూ సాటిరారన్నారు. ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఐలమ్మకు ఘన నివాళులు
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు బీసీ, రజక సంఘాల నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె పోషించిన పాత్రను స్మరించుకున్నారు. నల్లగొండలోని చాకలి ఐలమ్మ భవన్లో నిర్వహించిన వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వీరనారికి నివాళులర్పించారు. ఆదిలాబాద్లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు పాల్గొని ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హనుమకొండలోని శాయంపేట జంక్షన్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. డీజీపీ కార్యాలయంలో సీఐడీ డీజీ గోవింద్సింగ్, అడిషనల్ డీజీ శివధర్రెడ్డి, ఐజీ విక్రమ్సింగ్ మాన్, ఇతర ఉన్నతాధికారులు ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో డైరెక్టర్ శిఖాగోయల్ ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.