హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/ రవీంద్రభారతి: చాకలి ఐలమ్మను ఏ ఒక కులానికో పరిమితం చేయొద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్తి అని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఆత్మగౌరవం కోసం భూస్వాములకు ఎదురొడ్డి గొప్ప పోరాటం చేశారని స్మరించుకొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఐలమ్మ 128వ జయంతి వేడుకల్లో మంత్రి గంగుల పాల్గొని నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీసీ వీరుల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. శతాబ్దకాలానికిపైగా మరుగున పడిన ఐలమ్మ పోరాటాన్ని వెలికితీసి, అధికారికంగా ఆమె జయంతి, వర్ధంతిని నిర్వహించే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు గంగుల ధన్యవాదాలు తెలిపారు.
సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యు త్తు అందించే ఉత్తర్వులను కూడా విడుదల చేసే అదృష్టం దక్కిందని చెప్పారు. వారి అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. బీసీ గురుకులాల్లో చదువుతున్న తమ బిడ్డలు గడగడా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఉప్పొంగుతున్నారని పేర్కొన్నారు. బీసీ వృత్తిదారులకు లక్ష ఆర్థిక సాయం చేసి ప్రోత్సాహం అందిస్తున్నట్టు చెప్పారు. కోకాపేట, ఉప్పల్ భగాయత్ వంటి చోట్ల వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలను 41 బీసీ సంఘాలకు కేటాయించారని సంతోషం వ్యక్తంచేశారు. ‘ఎన్నికల సమయంలో వచ్చి అరచేతిలో స్వర్గం చూపించేవారి మాయలో పడకుండా, కడుపునింపే సీఎం కేసీఆర్కే మద్దతు ఇవ్వాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు ఉపేంద్ర, కిశోర్, జయంతి కమిటీ చైర్మన్ అకరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ విగ్రహావిష్కరణలు
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. నిర్మల్లోని వివేకానంద చౌక్ వద్ద ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఐలమ్మ విగ్రహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.