పటాన్చెరు, జూలై 21: నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ పీడీ వాఘేలా అన్నారు. గీతం డీమ్డ్ వర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో శుక్రవారం ట్రాయ్ కార్యదర్శి వీ రఘునందన్తో కలిసి అధ్యాపకుల తో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పీడీ వాఘేలా మాట్లాడు తూ.. మనం పరిశోధనపై దృష్టిపెట్టకపోతే వెనకబడిపోతామని పేర్కొన్నారు. కమ్యూనికేషన్, ప్రసారాల్లో ప్రాథమిక పరిశోధనలో ఇప్పటికే వెనుకబడ్డామని తెలిపారు. ఆచరణాత్మక పరిశోధనలో మాత్రం బలంగా ఉన్నామని చెప్పారు.
ట్రాయ్ ప్రభుత్వం కాదని, కేవలం నియంత్రణ సంస్థ మాత్రమేనని స్పష్టంచేశారు. టెలికాం టారిఫ్లను మార్కెట్లోని సర్వీస్ ప్రొవైడర్లకే వదిలివేశామని, అందువల్లనే ప్రపంచంలోని చాలా దేశాలకంటే తక్కువ ధర కు కోట్ల మందికి మొబైల్ సేవలను అందించగలుగుతున్నామని వెల్లడించారు. కృత్రిమ మేధ (ఏఐ)లో సమగ్ర పర్యావరణ వ్యవస్థను ప్రతిపాదించిన ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మనమూ ఒకరమన్నారు. ఇది విద్య, వైద్యరంగంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఏఐ, ఆగ్మెంట్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) రోబోటిక్స్, యంత్రం నుంచి యంత్రంలోకి (ఎంఎల్) ప్రవేశించడం వంటి రంగాలన్నింటిలోకి భారత్ పయనిస్తుందని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో 15శాతానికి చేరినట్టు డాక్టర్ వాఘేలా పేర్కొన్నారు.