ఆలేరు టౌన్, మే 13 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పాల శీతలీకరణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన మదర్ డెయిరీ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శలుచేయగా.. మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ సందర్భంగా శ్రీకర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పాడి రైతుల అభ్యున్నతి కోసం రూ.2 వేల కోట్లు ఇచ్చినట్టు స్పష్టంచేశారు.
చిట్యాలలోని 30 ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెడితే దాన్ని అమ్మకుండా తాను కేసు వేసినట్టు తెలిపారు. అందువల్లే డెయిరీ ఆస్తుల అమ్మకం నిలిచిపోయిందని గుర్తుచేశారు. ప్రభుత్వం మళ్లీ రాజీకి వస్తే ఉద్యోగులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసు విత్డ్రా చేసుకుంటే.. ఎన్డీడీబీ రూ.10 కోట్లు ఇచ్చిందని చెప్పారు. రూ.10 కోట్లకే ప్రస్తుత ప్రభుత్వం ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. కేసీఆర్ రూ.2వేల కోట్లు కేటాయించి ప్రతి పాడి రైతుకూ బర్రెలు, గొర్రెలు, పశుదాణా అందించిన రోజున కూడా తాము ఇంత ఆర్భాటం చేయలేదని తెలిపారు. తమ హయాంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే సీబీఐ విచారణకు సిద్ధమని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.