హైదరాబాద్ : ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారాహిత్యంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్కు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దిగజారిందని, ఇప్పుడు రాజాసింగ్ అంతకంటే ఒక అడుగు ముందుకేసి దారుణ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. మతకల్లోలాలకు ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.