HPV Vaccine | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న గర్భాశయ క్యాన్సర్కు హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాతో చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పదేండ్ల వ్యవధిలో దేశంలోని వివిధ దవాఖానల్లో 10-18 ఏండ్ల మధ్య వయసుండి హెచ్పీవీ టీకా వేసుకొన్న 2,135 మంది బాలికలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ వివరాలను హ్యూమన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్మునోథెరిపిటిక్స్ జర్నల్లో ప్రచురించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. బాలికలకు హెచ్వీపీ సింగల్ డోస్ టీకా వేయడం వల్ల గర్భాశయ క్యాన్సర్ యొక్క జీవితకాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది. అలాగే యుక్త వయసుకు ముందే బాలికలకు రెండు డోసు(మోతాదు)ల హెచ్వీపీ వ్యాక్సిన్లు వేయడం వల్ల మరింత వేగంగా గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించ వచ్చని అధ్యయనం వివరించింది.