హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్పారు. ఆయన బుధవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. ఓటు వేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్ని ఎలక్షన్ కమిషన్ పూర్తిచేసిందని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ డే – హాలిడే కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం 2.50 లక్షల మంది సిబ్బంది, లక్ష మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ఓటు ఉన్న వారికి పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తిచేశామని, ఎవరికైనా రాకుంటే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రంలో క్యూలైన్, లొకేషన్ కూడా తెలుసుకోవచ్చని అన్నారు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని, అందుకే ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. దాదాపు 10 లక్షల మంది 18, 19 సంవత్సరాల యువత కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారని, వారు కూడా ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనాలని సీఈవో కోరారు.
ఆకర్షణీయంగా పోలింగ్ కేంద్రాలు
పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తయారు చేశామని చెప్పారు. పండుగ వాతావరణంలో ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కార్యాలయానికి, సంస్థకు సెలవు ప్రకటించామని, ఇంకా ఎవరైనా సెలవు ప్రకటించకుంటే తమ దృష్టికి తీసుకరావాలని చెప్పారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని సంస్థలు సెలవు ప్రకటించే విధంగా చూడాలని కార్మిక శాఖకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో 12 వేల కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని, అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఇక్కడ బందోబస్తును మరింత పెంచామని తెలిపారు. నగరాల్లో ఒకే దగ్గర ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట బయట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన వారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, వారందరు ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలట్ ద్వారా 2.03 లక్షల మంది ఓటు వేశారని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య రెట్టింపు అని తెలిపారు.
సెలవు.. ఓటు వేసేందుకే!
ప్రజాస్వామ్యంలో మనల్ని పాలించే వారిని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకే కల్పించింది. ప్రజల చేత, ప్రజల యెక్క, ప్రజల కొరకు అనే ప్రధాన ఉద్దేశాలతో ఇది ఇమిడివుంది. ప్రజలు పరిణతి ప్రదర్శించి తమ ఓటుహక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలుపించుకోవాలి. ఈ ఉద్దేశంతోనే పోలింగ్ రోజు ఎన్నికల కమిషన్ పెయిడ్ హాలీడే (వేతనంతో కూడిన సెలవు) ప్రకటిస్తుంది. చదువుకుంటున్న విద్యార్థులు, యువత, వివిధ ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. పోలింగ్ రోజు ఇచ్చే సెలవును విహారయాత్రలకు, పిక్నిక్లకు వినియోగిస్తున్నారు. ఓటు మన తలరాతను మారుస్తుందనడంలో సందేహం లేదు. ఐదేండ్ల భవిష్యత్తుకు ఇది పునాది వేస్తుంది. ఓటింగ్ సందర్భంగా పరిణతి ప్రదర్శించకపోతే ఐదేండ్లు గోసపడక తప్పదు.