Minister Harish Rao | మెడికల్ కాలేజీ (Medical College)ల విషయంలో కేంద్ర (Center) తెలంగాణ (Teleangana)కు అన్యాయం చేసిందన్నది పచ్చినిజమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) అన్నారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్రావు స్పందించారు. అలాగే గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్రాన్ని ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని సైతం మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా ఇవ్వకుండా తెలంగాణకు ఇవ్వకుండా మొండిచేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకటి, రెండో ఫేజ్లో ఒక్క కాలేజీ ఇవ్వలేదని, మూడో ఫేస్లో ఇస్తామని చివరకు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ అదే వివక్షను ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడుగలేదని అంటే.. మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందని, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండడంతో మంజూరు చేయలేకపోయామని చెబుతున్నారని గుర్తు చేశారు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ? ఎవరు తప్పుదారి పట్టుస్తున్నారు? అంటూ మంత్రి నిలదీశారు.
కేంద్రం మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ సొంత నిధులతో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించారన్నారు. ఈ ఏడాది తొమ్మిది, మరో ఏడాది ఎనిమిది ఇలా జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉండడం వాస్తవం కాదా? అన్నారు. ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనసు రానివాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా? అని ప్రశ్నించారు.
గతంలో బీబీనగర్ ఎయిమ్స్కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని ఓ కేంద్రమంత్రి మంత్రి నాలుక కరుచుకున్నారని గుర్తు చేశారు. ఆధారాలు చూపిస్తే నోట మాటరాలేదని, ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు గల్లీలోని మా పీహెచ్సీ స్థాయిలో లేదని, ఎందుకు అధ్వాన్నంగా ఉంది? అని ప్రశ్నించారు. రూ. 1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా.. ఎందుకు రూ.156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు నిలదీశారు.
ఇదే సమయంలో అంటే 2018లో మంజూరైన గుజరాత్ ఎయిమ్స్కు 52శాతం నిధులు ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ అన్యాయాల గురించి ఎందుకు ఒక్కరూ మాట్లాడరని మండిపడ్డారు. ఎందుకు తెలంగాణ ప్రయోజనాల గురించి కేంద్రాన్ని నిలదీయరు? అంటూ నిలదీశారు. ఏపీ పునర్ విభజన చట్టం -2014 లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్ భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసిన వారవుతారంటూ మంత్రి హరీశ్రావు చురకలంటించారు.