హైదరాబాద్: సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్ భగీరథ ద్వారానే రాష్ట్రంలోని ప్రజలందరికి శుద్ధిచేసిన పరిశుభ్రమైన తాగునీరు అందుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని అనేక రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిచాయని గుర్తుచేశారు. తెలంగాణలోనే అతి తక్కువ శాతం కలుషిత జలాలు ఉన్నట్లు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమధానం చెప్పిందని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ పథకం ప్రాధాన్యతను గుర్తంచాలన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథకు ప్రశంసలు, అభినందనలే కాకుండా నిధులు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
2021-22 సంవత్సరంలో రాష్ట్రంలో 1.74లక్షల నమునాలను పరీక్ష చేయగా 411 నమునాల్లో మాత్రమే కలుషిత జలాలు ఉన్నట్లుగా గుర్తించారన్నారు. ఇది కేవలం 0.23 శాతమని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రెండుంకల సంఖ్యలో కలుషిత జలాలు ఉన్నట్లుగా గుర్తించారన్నారు. తెలంగాణలో ప్రతి ఏడాది రెండు సార్లు అన్ని గ్రామాల్లో తాగునీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.