హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీమా, మంజీర, పెన్గంగ-వార్ధా, తుంగభద్ర, వైన్గంగ-ప్రాణహిత నదులపై నేషనల్ వాటర్వే ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. దీనిపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యుడు దీవకొండ దామోదర్రావు అడిగిన ప్రశ్నకు నౌకాయానశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ మంగళవారం ఈ మేరకు జవాబిచ్చారు. ఎన్నో అనుకూలతలు ఉన్న తెలంగాణలో నదీ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కేంద్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. కృష్ణా నదిపై ముక్త్యాల నుంచి విజయవాడ వరకు 82 కిలోమీటర్ల వాటర్వేను రూ.96 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం మంత్రి తెలిపారు. ఇండియన్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పనులను చేపడుతున్నదని వివరించారు.
పీఎంజీఎస్వై ఫేజ్-3 పనులు మంజూరు
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్వై) ఫేజ్-3 పనులను 2025 మార్చి వరకు పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. దీనిపై చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పీఎంజీఎస్వై మూడో దశలో తెలంగాణకు 2,395 కిలోమీటర్ల మేర 356 పనులను ఈ నెల 14న మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ పనులను చేపట్టే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించామని వెల్లడించారు.