కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గింజ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి రైతులకు ఉరి వేస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ధాన్యం పండించే రైతులను ధనవంతులను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతుంటే.. కేంద్రం అన్నదాతలను ధైన్య స్థితిలో నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. నిల్వలు ఉన్నాయని చెప్తూ కొనుగోలు చేయబోమని చెప్పడం రాజ్యాంగ నిబంధనలకు పూర్తి విరుద్ధమని విమర్శించారు. కేంద్ర విధానాల వల్ల తెలంగాణ రైతులు అయోమయంలో పడ్డారని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఉత్పత్తిని సృష్టించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంటు, రైతుబంధు, ప్రాజెక్టులు కట్టి బీడు భూములను కూడా సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పంట దిగుబడి వస్తున్నదని పేర్కొన్నారు. అవే నిబంధనల ప్రకారం కొనుగోళ్లు, ధాన్యం, బియ్యం నిల్వలు ఎగుమతులు, మార్కెటింగ్ విధానం వంటివి చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని తెలిపారు. కానీ, కేంద్రం ఆ నిబంధనలను కాలరాస్తున్నదని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కరాఖండిగా చెప్పడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ఐదేండ్లకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయనే సాకుతో బాయిల్డ్ రైస్ కొనలేమని చెప్తున్నదని, మరి తెలంగాణలో పండించిన పంటను ఏంచేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతులపై కేంద్రం అడుగడుగునా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి గంగుల విమర్శించారు. రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై బండి సంజయ్తోపాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించాలని, రాష్ట్రంలో ఉత్పత్తయ్యే బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మే యర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.