(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక బిల్లు డ్రాఫ్ట్ను మంగళవారం విడుదల చేసిన కేంద్రప్రభుత్వం లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టతనిచ్చినప్పటికీ, అసెంబ్లీ సీట్ల పెంపుపై మాత్రం సరైన వివరణ ఇవ్వలేదు.
డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను గరిష్ఠంగా 850కు పెంచనున్నట్టు కేంద్రం వెల్లడించింది. తద్వారా రాష్ర్టాల్లో 815 వరకూ లోక్సభ సీట్లు పెరుగనుండగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీల్లో) 35 వరకూ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణ చేస్తామని వివరించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఏ మేరకు ఉంటుందో వెల్లడించలేదు.
ఇటీవల కొన్ని పార్టీలతో సమావేశమైన కేంద్రం..లోక్సభతో పాటు 28 రాష్ర్టాల్లోని శాసనసభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచుతామంటూ తెలియజేసింది. దీని ప్రకారం.. 543గా ఉన్న లోక్సభ స్థానాలు 816కు పెరుగడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు కూడా 6,185కు చేరుతాయని లీకులు ఇచ్చింది. అయితే, తాజా డ్రాఫ్ట్లో ఆ విషయాన్ని కూడా చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఇక, ఒక రాష్ట్ర శాసనసభకు గరిష్ఠంగా 500 సీట్లు మాత్రమే ఉండాలని ఆర్టికల్170 నిబంధన చెబుతున్నది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఆర్టికల్170కు సవరణలను చేస్తామని అస్పష్టమైన ప్రకటన చేసిన కేంద్రం.. లోక్సభ గరిష్ఠ సీట్లను ప్రకటించినట్టుగా.. అసెంబ్లీ గరిష్ఠ సీట్లను ప్రకటించలేదు. దీంతో ఈ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకొందా? అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.