1.3% మందికే బూస్టర్ డోస్
కేంద్రం అడ్డగోలు నిబంధనలతో మూడో డోస్కు దూరం
18-59 ఏండ్లవారు ప్రైవేట్లోనే వేసుకోవాలన్న కేంద్రం
ప్రభుత్వ కేంద్రాల్లో వేయాలని కోరిన మంత్రి హరీశ్రావు
కేంద్ర ప్రభుత్వం నుంచి కరువైన సానుకూల స్పందన
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బూస్టర్ డోస్పై కేంద్రం పెడుతున్న కొర్రీలు దేశవ్యాప్తంగా 18-59 ఏండ్ల మధ్య వయస్కులకు శాపంగా మారాయి. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే 18 ఏండ్లకు పైబడిన వారందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్రం చెప్తున్నది. కానీ, వారికి ప్రభుత్వ దవాఖానల్లో వేయలేమని, మూడో డోస్ను ప్రైవేట్ కేంద్రాల్లో కొనుక్కొని వేసుకోవాలని గత నెల 9న సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది బూస్టర్ డోస్కు దూరంగా ఉంటున్నారు. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 1.3% మంది మాత్రమే మూడోడోస్ వేసుకున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా సుమారు 19.18 కోట్ల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లో మొదటి రెండు డోసులు 100 శాతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం టీకాల కాలపరిమితి గరిష్ఠంగా మూడు నెలలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే టీకాల్లో అధికశాతం వృథా అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వ్యాక్సిన్ వయల్స్ చెత్తకుప్పల్లో దర్శనమిచ్చిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. శనివారం ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపాన ఉన్న చెత్తకుప్పలో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడ్డాయి. గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, యూపీలో చెత్తకుండీల్లో టీకాలు కనిపించాయి. ఇలా అనేక డోసుల టీకాలు వృథాపోతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం బూస్టర్ డోస్ విషయంలో మొండివైఖరితోనే ఉన్నది.
ఏడున్నర లక్షల మంది మాత్రమే..
మే 1న కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 18-59 ఏండ్ల మధ్య వయస్కుల్లో 66.69 కోట్లు కోట్ల మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. ఇందులో కనీసం 50 కోట్ల మంది మూడో డోస్కు అర్హులుగా ఉన్నట్టు అంచనా. ఇందులో ఇప్పటివరకు 7.51 లక్షల మంది మాత్రమే బూస్టర్ డోస్ వేసుకున్నట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కేవలం 1.3 శాతం మంది మూడో డోస్ వేసుకున్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా ఒక్కో డోస్కు ప్రైవేట్లో ధర రూ.225గా నిర్ణయించారు. సర్వీస్ చార్జీ రూ.150 అదనం. అంటే ఒక్కో టీకా వేసుకోవాలంటే కనీసం రూ.375 అవుతున్నది. ఇంట్లో నలుగురు వేసుకోవాలంటే రూ.1500 ఖర్చు అవుతుంది. ఇది పేద, మధ్య తరగతివర్గాలకు భారంగా మారడంతో కోట్లాది మంది దూరంగా ఉంటున్నారు.
తెలంగాణ కోరినా.. స్పందన లేదు
18-59 ఏండ్ల మధ్య వయస్కులకు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గత నెల 13న కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్రమే చెప్తున్నదని గుర్తు చేశారు. యువత, వయోజనులను ప్రైవేట్ కేంద్రాలకే పరిమితం చేయడం దారుణమని చెప్పారు. కొన్ని రాష్ర్టాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం, కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. అయినా ఇప్పటికీ కేంద్రం స్పందించడం లేదు.