భువనగిరి అర్బన్, జనవరి 24: తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక కారిడార్లు, ఇతర పరిశ్రమలు, రాష్ర్టాభివృద్ది కోసం రూ.14 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 1,814 కిలోమీటర్ల కొత్త రైల్వేలైన్, వరంగల్ జిల్లాలో రైల్వేకోచ్, గిరిజన మెడికల్ యూనివర్సిటికీ ల్యాండ్తోపాటు రూ.40 కోట్లు ఇచ్చినా అనుమతులు ఇవ్వట్లేదని విమర్శించారు. పార్లమెంట్లో ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినట్టు గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు రైల్వేలైన్లు, నిధులు ఇవ్వడం, బీజేపీ అధికారంలేని రాష్ర్టాలకు మొండిచెయ్యి చూపడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంనుంచి గెలిచిన కిషన్రెడ్డి, బండి సంజయ్ నిధుల కోసం సహకరించకుండా అవహేళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, వెంకట్రెడ్డి తాము ఏదో చేశామని గొప్పలు చెప్పడం తప్ప రాష్ర్టానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో రాష్ర్టానికి నిధులు కేటాయించకుంటే టీఆర్ఎస్ పక్షాన పోరాటం ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.