వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన కాకతీయ కట్టడాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా ఉన్న వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం పై నిర్లక్ష్యం కనబరుస్తున్నది. రాష్ర్టానికి చెందిన కిషన్రెడ్డి సాక్షాత్తు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నా గుడి పునర్నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు మిగిలాయి. కేంద్రం చిన్నచూపుతో 17ఏండ్లుగా గుడి పునరుద్ధరణ పనులు ముందుకు సాగడంలేదు. విప్పి పక్కన పెట్టిన శిలలు, శిల్పాలు ఎక్కడెక్కడో పడి ఉన్నాయి. వెయ్యేండ్ల క్రితం నాటి ఈ గొప్ప నిర్మాణం పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది.
2005లో నిర్ణయం.. 2010లో పనులు
2005లో వెయ్యిస్తంభాల గుడి పునర్నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2006 లో రూ.3.50 కోట్లను మంజూరు చేసింది. 2009 లోపు ఈ పనులు పూర్తిచేయాల్సి ఉండగా 2010 ఫిబ్రవరి 3న పనులు మొదలయ్యాయి. 2012 నాటికి అంచనా వ్యయం రూ.7.50 కోట్లకు చేరింది. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో స్తపతి బృందం పనులు వదిలేసి వెళ్లింది. 2018లో కొన్ని నిధులను విడుదల చేసినా, అవి గతంలో చేసిన పనులకే చెల్లించారు. పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు మరో రూ.6 కోట్లు అవసరమవుతాయని కేంద్ర పురావస్తు శాఖ రెండేండ్ల క్రితం అంచనా వేసినా కేంద్రం స్పందించడంలేదు.
విప్పి కుప్ప పెట్టారు!
వెయ్యి స్తంభాల గుడిని 1163 సంవత్సరంలో కాకతీయ పాలకుడు రుద్రదేవుడు నిర్మించారు. ఆలయం పక్కన 1,400 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కల్యాణ మండపాన్ని తీర్చిదిద్దారు. భూకంపాలను తట్టుకొనేలా శాండ్ బాక్స్ టెక్నాలజీని అనుసరించి నిర్మించారు. కాగా, పునర్నిర్మాణం కోసం ఈ మండపాన్ని పూర్తిగా విప్పారు. విరిగిపోయిన 132 పిల్లర్లను, 160 బీముల స్థానంలో కొత్త వాటిని తయారు చేశారు. మండపం పునర్నిర్మాణంలో భాగంగా స్తంభాలను నిలబెట్టారు. గోడలు మాత్రమే ఉండి పైకప్పు లేని నిర్మాణంలా ఇప్పుడు మండపం మిగిలింది.
ఆలయం వెలుపల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి
చారిత్రక ప్రాధాన్యం ఉన్న వెయ్యిస్తంభాల గుడికి వచ్చే భక్తులు, పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లతో ఆలయ ఆవరణ బయట మౌలిక వసతులను కల్పించింది. గుడి ప్రధాన ద్వారం నుంచి వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారికి మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది.