రాష్ట్ర విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం
అర్హులకు అందని ప్రికాషన్ డోస్
ఇప్పటి వరకు వేసింది 3 శాతమే
కొవిడ్ కేసుల పెరుగుదలతో ఆందోళన
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ర్టాలు అప్రమత్తం కావాలని, టెస్టులు, ట్రేసింగ్ చేయాలని, అర్హులందరికీ టీకాలు వేయాలని కేంద్రం చెబుతున్నది తప్ప.. బూస్టర్ డోస్పై మాట మాట్లాడటం లేదు. ప్రికాషన్ డోస్ను ప్రభుత్వ ఆధ్వర్యంలో వేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. కేంద్రం నిబంధనల పర్యవసానంతో రాష్ట్రంలోని అర్హుల్లో 3 శాతం మంది మాత్రమే మూడో డోస్ తీసుకొన్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 18 ఏండ్లకు పైబడిన వారు బూస్టర్ డోస్ వేసుకొనేందుకు కేంద్రం ఏప్రిల్ రెండో వారంలో అనుమతి ఇచ్చింది. అయితే, 60 ఏండ్లకు పైబడినవారికి మాత్రమే ప్రభుత్వ కేంద్రాల్లో వేస్తామని, మిగతావారు ప్రైవేట్ కేంద్రా ల్లో తీసుకోవాలని నిబంధన విధించింది. దీంతో ప్రైవేట్కు వెళ్ల లేక 97 శాతం మంది మూడో డోస్కు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడిన వారందరికీ రెండు డోసులు పూర్తయ్యాయి. వారం తా ఇప్పుడు మూడో డోస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కేంద్రం నిబంధన అడ్డుగా మారింది. మొత్తం 2.76 కోట్ల మంది అర్హులు ఉండగా.. ఇందులో ఇప్పటి వరకు 9.19 లక్షల మంది మాత్రమే బూస్టర్ డోస్ వేసుకొన్నారు.
మూడుసార్లు విజ్ఞప్తి చేసినా!
అర్హులందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బూస్టర్ డోస్ వేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఇప్పటి వరకు మూడుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు సార్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి లేఖలు రాశారు. మరోసారి నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దేశవ్యాప్తంగా సరిపడా టీకాల నిల్వలు ఉన్నాయి. ఆదివారానికి దేశవ్యాప్తంగా 12.77 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయి. మరో రెండు నెలల్లో లక్షల డోసుల గడువు ముగుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అంటే అవన్నీ పెంటకుప్ప పాలు కావాల్సిందే. ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాటిని సద్వినియోగం చేయాలని కేంద్రాన్ని తెలంగాణ సర్కారు కోరుతున్నది.